మూడు అద్భుతాలు

kalluri-1 మహాభారతంలో అశ్వత్థామ చాలా విలక్షణ పాత్ర.  ద్రోణ, శల్య, సౌప్తికపర్వాలలో తిక్కన ఆ పాత్రను అత్యద్భుతంగా పండిస్తాడు. నిజానికి శల్య, సౌప్తికపర్వాలు రెండింటిలో కథానాయకుడు(లేదా ప్రతినాయకుడు) అశ్వత్థామే. యుద్ధమనే ఒక మహోద్రిక్తఘట్టంలో, అందులోనూ పరాజిత పక్షానికి చెందిన ఒక వీరుడు ఎదుర్కొనే ఆత్మసంక్షోభాన్నీ, మనస్సంఘర్షణను, భావోద్వేగాలను అశ్వత్థామ ముఖంగా తిక్కన ఎంతో లోతుగా, గాఢంగా చిత్రిస్తాడు. ఆ లోతును, గాఢతను తడిమి చూసి ఎవరైనా విశ్లేషించారో లేదో నాకు తెలియదు. చదువుతూ తిక్కన మహాకవికి మనసులో పాదాభివందనం చేసుకొన్న ఘట్టాలలో ఇది ఒకటి. అశ్వత్థామ చిత్రణపై నా హృదయస్పందనను పూర్తిగా వెల్లడించాలని మనసు ఉత్సాహపడుతున్నా, బలవంతం మీద ఆపుకుని విషయానికి వస్తాను.

అశ్వత్థామను కళ్ళారా చూసిన ఒక వ్యక్తి ఉన్నారనీ, ఆయన ఆ విషయం చెప్పగా విన్న వ్యక్తిని నేను ఎరుగుదుననీ మా నాన్నగారు అంటుండేవారు. అశ్వత్థామనేమిటి, చూడడమేమిటనుకుని మీరు విస్తుపోతూ ఉండచ్చు. చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడని ఒక విశ్వాసం. ఇంతకీ విషయమేమిటంటే, హిమాలయ ప్రాంతంలో కొంతకాలం ఉన్న ఆ వ్యక్తి ఓ ఉషఃకాలాన నదికి స్నానానికి వెళ్లారు. అంతలో ఓ భారీకాయుడు నదిలోకి దిగబోతూ కనిపించాడు. ఆయన శరీరమంతా తూట్లు పడి చర్మం వేలాడుతోంది. జడలు కట్టి ఉన్నాయి. నదిలోకి దిగబోతున్న ఆ వ్యక్తిని చేతితో వారించాడు. దిగ్భ్రమతో గట్టుమీద నిలబడి పోయిన ఆ వ్యక్తి ఆయన స్నానం ముగించుకుని వెడుతుంటే, “తమరెవరు స్వామీ?” అని సంస్కృతంలో ప్రశ్నించారు. “ నేను ద్రోణపుత్రుడను, అశ్వత్థామను” అని ఆయన సంస్కృతంలోనే సమాధానం చెప్పి వెళ్లిపోయాడు.

ఈ ముచ్చట గుర్తొచ్చినప్పుడల్లా ఇందులోని అద్భుతత్వాన్ని ఇప్పటికీ  నేను ఆస్వాదిస్తూ ఉంటాను. ఇది సాధ్యమా అన్న హేతువాదంతో ఆ అద్భుతత్వాన్ని చిత్రవధ చేయడానికి నాకు మనసు రాదు. సంప్రదాయం ఏమిటంటే, వీరులు, లేదా ఇతర కారణాలతో జనహృదయాలకు దగ్గరైనవారు ఎప్పటికీ మరణించరు. జనం జ్ఞాపకాలలో చిరంజీవులుగానే  ఉండిపోతారు.  అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు మనకు బాగా తెలిసిన ఇటీవలి ఉదాహరణలు. నిజానికి ఈ సంప్రదాయం మనలోనే కాదు ప్రపంచమంతటా ఉంది. ఆ వివరాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి అశ్వత్థామ విషయానికి వస్తే, ఆయన చిరంజీవిత్వానికి వివిధ కారణాలను ఊహించవచ్చు. ఒకటి, రెండు చెప్పుకోవాలంటే, యుద్ధం ముగిసిన తర్వాత కౌరవపక్షంలో మిగిలిన ముగ్గురు వీరులలో(మిగతా ఇద్దరూ కృపుడు, కృతవర్మ) ప్రముఖుడు అశ్వత్థామే. అంతేకాదు, ఒకవిధంగా ఆయన కురు, పాంచాల జనపదాలు రెండింటికీ ఉత్తరాధికారి. కనుక ఆ రెండు జనపదాల ప్రజలూ ఆయనను సజీవస్మృతిగా నిలుపుకోడానికి కారణం ఉంది. అలాగే. అంతటి మహాయుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడడం కూడా అతనిని ‘చిరంజీవి’ని చేసి ఉండచ్చు.Mahabharata04ramauoft_1395

 

అశ్వత్థామ ఉదంతం నమ్మలేని అద్భుతం అయితే, నమ్మదగిన అద్భుతం ఒకటి చెబుతాను.  అది: అలెగ్జాండర్-పురుషోత్తముల యుద్ధసమాచారం. ఆ యుద్ధం గురించి చరిత్రపాఠాలలో చదువుకున్నాం కానీ, ప్రత్యక్షకథనాన్ని తోపించే అదనపు సమాచారం మనకు తెలియదు. పురుషోత్తముని గ్రీకులు ‘పోరస్’ అన్నారు. అతని అసలు పేరు పురుషోత్తముడేనా అని నా సందేహం. అతను పురాణ ప్రసిద్ధమైన పురు వంశీకుడు. ఆ వంశంలో చివరి రాజు అని కోశాంబి అంటాడు.  ప్లూటార్క్ అనే చరిత్రకారుడు అలెగ్జాండర్ స్వయంగా రాసిన లేఖలనుంచి సంగ్రహించినదిగా చెబుతూ, ఆ యుద్ధం గురించి కొంత ఆసక్తికర సమాచారం అందించాడు:

(పురు రాజు ఓడిపోయినా) ఆ యుద్ధం అలెగ్జాండర్ సైన్యంలో ధైర్యాన్ని హరించేసింది. వెనకడుగు వేయించింది. కేవలం ఇరవై వేల పదాతిదళంతో, రెండువేల ఆశ్వికదళంతో వచ్చిన పురురాజును ఓడించడానికే వారికి తల ప్రాణం తోకకొచ్చింది. తూర్పు దిశగా ఇంకా ముందుకు వెడితే ముప్పై రెండు ఫర్లాంగుల వెడల్పు, వంద నిలువుల లోతు ఉన్న గంగానదిని దాటవలసివస్తుంది. నదికి అవతల భారీ సంఖ్యలో శత్రుసేనల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. గంగానదీ ప్రాంతరాజులూ(Gangaridans), ఇంకా తూర్పున ఉన్న రాజులూ(Praesians-ప్రాచ్యులు) ఎనభైవేల ఆశ్వికదళంతో, రెండులక్షల పదాతిదళంతో, ఎనిమిదివేల రథికబలంతో, ఆరువేల గజబలంతో తమను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారని అలెగ్జాండర్ సేనకు తెలిసింది. కనుక వాళ్ళు అలెగ్జాండర్ ప్రణాళికను వ్యతిరేకించడం సహేతుకమే.

ఇది అలెగ్జాండర్ సైన్యాన్ని భయపెట్టడానికి చేసిన ప్రచారం కాదని ప్లూటార్క్ అంటాడు. ఆ సమీపకాలానికే చెందిన చంద్రగుప్తుడు ఆరులక్షల పదాతిదళంతో భారతదేశాన్ని లొంగదీసుకోవడమే కాక, సెల్యూకస్ కు ఒక్కసారిగా అయిదువందల ఏనుగులను బహూకరించిన సంగతిని ఉదహరిస్తాడు.  అలాగే, గంగానది గురించి చెప్పినదీ అతిశయోక్తి కాదని కోశాంబి అంటూ;  అలెగ్జాండర్ వచ్చే సమయానికి వర్షాకాలం మొదలైంది కనుక గంగ అంత వెడల్పూ, లోతూ ఉండడంలో ఆశ్చర్యం లేదంటాడు. రెండువేల సంవత్సరాల తర్వాత అహ్మద్ షా దురానీ వర్షాకాలంలోనే దండయాత్రకు దుస్సాహసం చేసి సగం సైన్యాన్ని యమునకు అర్పించుకున్నాడు. ఇంకా ఆసక్తికరం ఏమిటంటే, పురురాజు ఓటమికి ఒక మతవిశ్వాసం కూడా కారణం. వర్షరుతువులో ప్రయాణాలను, యుద్ధాలను అది నిషేధిస్తోంది. దాంతో పురురాజు తగినన్ని బలగాలను సమీకరించుకోలేకపోయి ఉండచ్చు.

ఇంకొకటి ఏమిటంటే, భారతీయ ఆశ్విక సేనకన్నా ఉత్తమశ్రేణికి చెందిన గ్రీకు ఆశ్వికసేన ముందు పురురాజు రథికసైన్యం తేలిపోయింది. అయితే, పురురాజు తన గజబలాన్ని సక్రమంగా వినియోగించుకుని ఉంటే యుద్ధం గెలవడానికి అవకాశం ఉండేదనీ, కానీ యుద్ధంలో ఆరితేరి శరవేగంతో కదిలే శత్రుసేనను ఎదుర్కోడానికి మరింత లోతైన వ్యూహనైపుణ్యం ఉండాలనీ, అప్పటి పంజాబ్ గణ వ్యవస్థలో అది అభివృద్ధి కాలేదనీ కోశాంబి అంటాడు.

alexander

గజసైన్యంతో ఒక ఇబ్బంది ఏమిటంటే, సక్రమంగా వాడుకోకపోతే అది శత్రుసైన్యాన్ని చంపేబదులు, సొంత సైన్యాన్నే చంపుతుంది. పురుసేనలో గ్రీకు దాడిని సమర్థంగా తిప్పికొట్టగల సత్తా ఉన్నవారు విలుకాండ్లు. అయితే వారినీ సక్రమంగా వాడుకోలేకపోగా, వర్షాలు పడుతున్నప్పుడు శరయుద్ధం ప్రభావం తగ్గుతుంది. భారతీయ విలుకాని దెబ్బను ఏదీ అడ్డుకోలేదనీ, పొడవైన ఆ బాణం డాలునూ, కవచాన్నీ కూడా చీల్చి వేస్తుందనీ, భారతీయ ధనువు ఆరడుగుల పొడవు ఉంటుందనీ ఆరియన్ అనే చరిత్రకారుడు రాస్తాడు. ఇది స్వయంగా అలెగ్జాండర్ అనుభవం కూడా. మూడు వేళ్ళ వెడల్పు ఉన్న సూచితో ఒక మల్ల విలుకాడు ప్రయోగించిన బాణం అలెగ్జాండర్ కవచాన్ని చీల్చుకుంటూ వెళ్ళి, పక్కటెముకకు గుచ్చుకుపోయింది. అతి కష్టం మీద దానిని తీయగలిగారు. అతను ఎదుర్కొన్న అతి తీవ్ర గాయం ఇదే.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, భారతదేశచరిత్రను మలుపు తిప్పిన ఒక యుద్ధం గురించిన ఈ మాత్రం సమాచారాన్ని కూడా మనవాళ్ళు ఎక్కడా నమోదు చేయలేదు. గ్రీకు రాతలే ఆధారం. గ్రీకులే కాదు, పశ్చిమాసియా దేశాలు కూడా వేల సంవత్సరాలనాటి చారిత్రక ఘటనలను వివిధ రూపాలలో భద్రపరిచాయి. పురాతనఅస్తిత్వం ఎంతో ఉన్న మనదేశంలోనే ఈ జాగ్రత్త లోపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  దానికితోడు, ఉన్న చారిత్రక సమాచారంపై కూడా ఇతరేతర అన్వయాల ముసుగులు కప్పి మాయం చేయడానికి ప్రయత్నించడం మరింత ఆశ్చర్యకరం. ఎంతో ఆసక్తిని కలిగించే ఈ విషయాలను ముందు ముందు చెప్పుకుందాం. చెప్పొచ్చేదేమిటంటే, మన చరిత్రాదారిద్ర్యం నుంచి చూస్తే పురు-అలెగ్జాండర్ యుద్ధవివరాలు అపురూపంగానే కాక అద్భుతంగా అనిపిస్తాయి.  పురాణానికి, చరిత్రకు మధ్యనున్న హద్దులను చెరిపేసి అవి మనల్ని మహాభారత సమాజానికి దగ్గరగా తీసుకువెడతాయి.

హేలీ రెండువందల ఏళ్లనాటి సమాచారాన్ని సేకరించగలగడం కూడా ఒక అద్భుతమే. చరిత్రను భద్రపరిచడంపై పాశ్చాత్యులలో ముందునుంచీ ఉన్న ఆసక్తికీ, జాగ్రత్తకూ అది నిదర్శనం.

***

మేరీ ల్యాండ్ గెజిట్, అక్టోబర్ 1 సంచికలోని ఆ ప్రకటన పురాతన అచ్చు అక్షరాలలో ఉంది.  JUST IMPORTED  అనే శీర్షికతో అందులో ఉన్న సమాచారం, కెప్టన్ డేవిస్ సారథ్యంలో గాంబియానుంచి వచ్చిన లార్డ్ లిగొనీర్ లోని సరకును అక్టోబర్ 7న విక్రయించబోతున్నట్టు చెబుతోంది. ఆ సరకులో CHOICE HEALTHY SLAVES కూడా ఉన్నారు. విచిత్రంగా ఆ ప్రకటన హేలీ కంటపడిన తేదీ సెప్టెంబర్ 29, 1967. లార్డ్ లిగొనీర్ అన్నాపొలిస్ రేవుకు చేరి అప్పటికి సరిగ్గా రెండువందల సంవత్సరాలు అయింది. ఆ రోజున అన్నాపొలిస్ రేవులో సముద్రజలాలలోకి నిర్మించిన నడవ మీద తప్ప ప్రపంచంలో మరెక్కడా ఉండాలని తనకు అనిపించలేదనీ, అలాగే ఉన్నాననీ హేలీ అంటాడు. ఆ నడవ మీద నిలబడి, తన పూర్వీకుడు కుంటా కింటేను తీసుకొచ్చిన సముద్రజలాలవైపు చూస్తూ మరోసారి దుఃఖం ఆపుకోలేకపోయానని అతను అంటాడు.

1766-67 నాటి ఆ పత్రం గాంబియాలోని జేమ్స్ దుర్గంలో తయారైంది. దాని ప్రకారం లార్డ్ లిగొనీర్ 140 మంది బానిసలతో బయలుదేరింది. వాళ్ళలో ఎంతమంది బతికి బయటపడ్డారు? హేలీ రెండోసారి మేరీల్యాండ్ హాల్ ఆఫ్ రికార్డ్స్ కు వెళ్ళాడు. అక్కడ ఆ ఓడలో రవాణా అయిన సరకుల జాబితా దొరికింది: 3,264 ఏనుగు దంతాలు, 3,700 పౌండ్ల తేనెటీగల జిగురు, 800 పౌండ్ల ముడి నూలు, 32 ఔన్సుల గాంబియా బంగారంతోపాటు 98 మంది “నీగ్రో’’లు ఆ జాబితాలో ఉన్నారు. అంటే మార్గమధ్యంలో 42 మంది చనిపోయారు.

అమ్మమ్మ, కజిన్ జార్జియా తదితరులు కూడా తమదైన పద్ధతిలో గాథికులే నన్న సంగతి అప్పటికి హేలీకి అర్థమైంది. అంతలో, అన్న జాన్ వేలర్ నుంచి తమ్ముడు డా. విలియం వేలర్ కుంటాను కొన్నాడు కనుక అందుకు సంబంధించిన రాతకోతలేవైనా జరిగి ఉండచ్చని అతనికి స్ఫురించింది. వెంటనే వర్జీనియాలోని రిచ్ మండ్ కు వెళ్ళాడు. స్పాట్ సిల్వేనియా కౌంటీలో  1767 సెప్టెంబర్ తర్వాత రాసుకున్న దస్తావేజుల మైక్రోఫిల్మ్ ను గాలించాడు. సెప్టెంబర్ 5 తేదీతో పాతకాలపు రాతలో ఉన్న ఒక పొడవైన దస్తావేజు కనిపించింది. అందులో, జాన్ వేలర్, అతని భార్య ఆన్ 240 ఎకరాల వ్యవసాయభూమిని, కొంత సామగ్రిని విలియం వేలర్ కు బదిలీ చేసినట్టు మొదటి పేజీలో ఉంది. రెండో పేజీలో-“and also one Negro man slave named Toby” అని ఉంది!  అతనే కుంటా కింటే!

హేలీ అన్వేషణ ముగిసింది. ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే, రొసెట్టా శిల నుంచి పొందిన ప్రేరణతో అతను అన్వేషణ ప్రారంభించి అప్పటికి పన్నెండేళ్ళు గడిచాయి! హేలీ లానే మూలాలనుంచి నిర్దాక్షిణ్యంగా నరికివేయబడి బానిసలుగా అమ్ముడుపోయిన నల్లజాతి పూర్వీకుల వారసులు బహుశా ఇప్పుడు కోట్లలో ఉంటారు. శూన్యంలో ఈదుతున్న వారి  మూలాల అన్వేషణ  ఎప్పటికీ ముగిసే అవకాశం లేదు. అసలా అన్వేషణ ప్రారంభం కాకపోయినా ఆశ్చర్యం లేదు.

కాలానికి బానిసలైన మనదేశంలోని సామాన్యుల జీవితాలూ ఇందుకు భిన్నం కావు.

                                                                                                             -భాస్కరం కల్లూరి

 

 

 

 

Download PDF

4 Comments

  • కల్లూరి భాస్కరం says:

    చిన్న సవరణ: కిందనుంచి మూడవ పేరాలో “సెప్టెంబర్ 5వ తేదీతో…” అని ప్రారంభమయిన వాక్యాన్ని “1768 సెప్టెంబర్ 5వ తేదీతో…” అని చదువుకోవాలి.

  • “యుద్ధమనే ఒక మహోద్రిక్తఘట్టంలో, అందులోనూ పరాజిత పక్షానికి చెందిన ఒక వీరుడు ఎదుర్కొనే ఆత్మసంక్షోభాన్నీ, మనస్సంఘర్షణను, భావోద్వేగాలను అశ్వత్థామ ముఖంగా తిక్కన ఎంతో లోతుగా, గాఢంగా చిత్రిస్తాడు. ఆ లోతును, గాఢతను తడిమి చూసి ఎవరైనా విశ్లేషించారో లేదో నాకు తెలియదు.”

    కొంతవరకు ఇందులో ప్రయత్నించారనుకుంటాను. వీలైతే చూడండి. యూట్యూబ్ లో వీడియో కూడా లభ్యం –
    http://en.wikipedia.org/wiki/Andha_Yug

  • కల్లూరి భాస్కరం says:

    నేను ఆ మాట అన్నది తిక్కనకు పరిమితమై అనుకోండి. అయితే మంచి నాటకం గురించి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.

  • chintalapudi venkateswarlu says:

    భాస్కరం గారూ !
    భారతీయుల నిర్లిప్తతపట్ల మీ అభిప్రాయం సమంజసమే. వీరు మరొకరెవరో చెబితేతప్ప చెవినివేసుకోరు. ఉదాహరణకు చర్ల రాణి 1900లో వాళ్ళరాజ్యం అవసానదశలో కొంతపొలం ఒక రైతుకు అమ్ముకున్నారు. ఆవిధంగా పత్రం దొరికింది. అయినా మన మేధావులు దానిని నమ్మరు. ఇక గాధికులనెవరు నమ్ముతారు? మన గాధికులు ఎవరూ ఆవృత్తిలో లేరు. ఒకరు నేటి మహా అవధానులలో ఒకరు. ఇదీ స్థితి. మన పురాగాధలు పాడేదెవరు ?
    చింతలపూడి.

Leave a Reply to chintalapudi venkateswarlu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)