ఇదే న్యాయం !

DSC_9165 

ఓదెల వెంకటేశ్వర్లు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ తెలుగు లిటరేచర్ చేసారు. చదువుకున్నది గోదావరిఖని మైన్స్ ప్రాంతం. స్వస్థలం  కరీంనగర్ జిల్లా పెద్దపల్లి దగ్గర ఓ చిన్న గ్రామం చీకురాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం . ఆంధ్రభూమి దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్టుగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు కు కథలు, కవితలు రాయడం పట్ల ఆసక్తి.  విరివిగా రాయలేదు కానీ ఇది రాయకుండా ఉండలేను అనుకున్నవే కథలుగా వచ్చాయని చెప్తాడు.  ఓదెల రాసిన  కామెడి కథలకు స్వాతి వీక్లీలో బహుమతులు వచ్చాయి. అనేక పత్రికల్లో కథలు అచ్చయ్యాయి.  “కడుపు కోత” పేరుతొ వచ్చిన కథల పుస్తకం  తనకు  గుర్తింపు నిచ్చింది అంటారు వెంకటేశ్వర్లు .  పందికొక్కులు, కడుపుకోత కథలు తనకు  మంచి  తృప్తినిచ్చాయి అని చెప్తారు. –వేంపల్లె షరీఫ్

 ***

రాత్రి నాలుగు గంటలకే లేచాడు లచ్చుమయ్య. జల్తీ జల్తీ మొకం కడుక్కుని, పశువుల దగ్గర పేడ తీసి , స్నానం చేసి తయారయ్యాడు.ఈ లోపు భార్య భాగ్యమ్మ లేచింది. పొద్దునే తయారవుతున్న భర్తను చూసి,
“మల్లెక్కడికి పోతాండో ఎమో! ఒక్కటి సుత చెప్పడు. ఏం మనిషో ఏందో, లేని నేను ఇంత సాయం చేయకపోదునా” అనుకుంటూ..
“అవునయ్యా ఎగిలివారంగనే లేచి తయ్యారకావడితివి. ఎటువోతున్నవ్” అడిగింది.
“పట్నం బోతున్నా”
“మొస మర్ర కుంట పని పెట్టుకుని పట్నం బోతాన్న అనడవడ్తివి. కైకిలోళ్ళను పిలిచి కలుపు తీపిద్దామని నిన్ననే చెప్పితి. దానికి నువ్వు సరేనంటివి. మళ్లా బుయ్య బుయ్య తయ్యారైతివి ”  ఇక్కడి పని అంతా తనమీద వదిలిలేనినాడని కోపంతో కనిరుచ్చికుంది.
“పట్నంల మా మామా దావతిద్దాండు. పొద్దు పొడిేనటల్లాకు రమ్మన్నడు గందుకే పోతున్నా” కాస్త వ్యంగం జోడించి చెప్పాడు.
“దావతికి నిన్ను రమ్మన్నోడు, మరీ పెండ్లాన్ని తీసుకరమ్మనలేదా?”  తను తక్కువ తినలేదన్నట్టుగా అడిగింది.
“ఎందో పొద్దుగాల పొద్దుగాల జగడానికి కాలు దుయ్యవడ్తివి” అన్నడు.
“మరి అడిగిందానికి సక్కగా జవాబు చెప్పకపోతివి. నేను జగడానికి కాలు దువ్వుతున్ననా, నువ్వా”
“నువ్వు కైకిలోల్లను తీసుకుని కలుపు తీపియ్యి. నేను పట్నం బోయ్యి మందు బస్తాలు దెస్తా. మరీ ఆడ ఎంత పెద్ద లైనుంటదో ఎరికెనా గింత పొద్గుగాల పోయిన ఎక్కన్నో ఎనకనిలవడవలసి వస్తది” చెప్పాడు.
“మరి గిముచ్చట చెప్పతందెకు ఏమో పరగ్యాసం ఆడవడ్తివి. నేను లేచి ఇంత సద్దికట్టి పంపిద్దుకదా?” అన్నది.
“ఏహె సద్దెందుకు తీయ్యి. పోయ్యి లైన్ల నిలవడితే ఆకలిలేదు. దూప లేదు. మందు బస్తాలు దొరికితే చాలు కడుపునిండినట్టే” అన్నడు.
“నివద్దనే. మందులు బస్తాలు దొరికితే మనమే అదృష్టవంతులం” అంటూ అంది.
“ఎవుసం చేసుడు మహాదండి కష్టమైతాంది.  ఇంత కష్టం మా నాయనలు, తాతలు కూడా పడలే. అరొక్కటి కొనుడేనాయే. విత్తనాలు కొనుడు, మందులు కొనుడు… అండ్ల కరెంటు సరింగా ఇయ్యరు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అన్నట్టుగా వుంది. ఎంత కష్టమైనా చేని పంట పండితే  దానికి గిట్టుబాటు ధర రాదు. ఇగ బతుకుడెట్లా”
“నువ్వద్దే నువు చెప్పింది. మరేం చేత్తం. మనకు అచ్చిన పని ఇదొకట్టేనాయే. సదుకోకపోతిమి ఏదైనా నౌకరి చేద్దామంటే.  దిక్కు లేక ఈ పని చేసుకుని కష్టాలుపడవడితిమి. ఎవుసం చేసుడు జూదం ఆడినట్టే వుంటాది. జూదమాడితే ఇంకా నయం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైన పైసలు వస్తాయి. కాని ఎవుసం చేస్తే  అప్పులు పెరిగపోవట్టే.”
టీవీలల్ల మాత్రం ఎరువులు ఇస్తున్నాం. ఎరువుల అక్రమాలు సాగనీయం. అందరికి న్యాయం చేస్తాం. రైతులను ఆదుకుంటాం అనవట్టిరి.
ఇక్కడ పరిస్థితి  చూస్తేనేమో  ఎదురు చూడగా చూడగా చుక్కతెగి పడ్డట్టు ఒక్క లారీ వస్తుంది. అందులో రికమేండేషన్ క్యాండిడెట్లు.  పోను మిగిలిన వారికి ఒకటి అర పంచడం జరుగుతుంది. ప్రపంచంలోనే రైతుల పట్ల ఇంత అన్యాయం జరిగేది ఇక్కడే కావచ్చు. ఎన్ని కష్టాలు ఓర్చుకోవాలి. విత్తనాలు దొరకవు. నీళ్ళు దొరకవు, కరెంట్ వుండదు. ఎరువులు దొరకవు. వీటిని తట్టుకుని కిందా మీద పడి ఏదో పంట పండిస్తే  గిట్టుబాట ధర వుండదు. కాని మధ్యవర్తులు ఇస్త్రీ  చొక్కా నలక్కుండా డబ్బులు దోచుకుంటారు. వీరికి హద్దు అదుపు లేదు. ఆఖరికి అందరికి అన్నం పెడుతున్న రైతన్నకే సున్నం పెడతారు.
“సరే తీయ్యి. ఎప్పుడున్న ఏడుపే గిది. వొడిేనదున్నది. ఆయిపోయేదున్నదా‘? నేను పోయెస్త” అంటూ బయలు దేరాడు.
“గట్లనే, జర ఉశారుగుండు. ఎవ్వనితోని లొల్లి పెట్టుకోకు, పయిలంగా పోయిరా” అన్ని జాగ్రత్తలతో పాటు హెచ్చరికలు చెప్పి సాగనంపింది.

***

kadupu
పట్నానికి దాదాపు పదికిలోమీటర్ల లోపు  పల్లెటూరు లచ్చుమయ్యది. ప్రతి పనికి పట్నానికి రావల్సిందే. పెళ్ళి నుండి చావు వరకు ఏ వస్తువు కోసమైనా ఇక్కడికి వచ్చి తీసుకపోవల్సిందే. ఇంటికి ఎవరైనా చుట్టము వచ్చినా కూడా మందు తెవాలన్న, చికెమ్ మటన్ లాంటివైనా తీసుకువెళ్ళాలన్న ఇక్కడినుండే. ఎందుకంటే ఇంటికి వచ్చిన చుట్టానికి కోయడానికి ఊళ్ళలో నేడు కోళ్లు లేవు.  ఎవరు పెంచడం లేదు. అదొ పెద్ద అయిపోయినుట్టుగా వుంది. అవసరమైనప్పుడు వెళ్ళి చికెన్, మటన్ పట్టుకురావడం అవసరాలు తీర్చుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇక కోళ్ళను పెంచడం, కోయడం, వాటిని శుభ్రం చేయడం వంటివి సిటీలాంటి ప్రదేశాలే కాదు, పల్లెటూర్లలో కూడా చేయడం లేదు. ”
అప్పుడే వచ్చిన  లారీ ముందు బస్తాల లోడ్ వచ్చేసరికి రైతుల్లో చాలా సందడి మొదలైంది.
మరీ ఎరువులా మజాకా. అక్కడ పరిన్థితి చూస్తె  కుస్తీ  పోటీలకు వచ్చినట్టుగానే వుంది. అందరూ గోచీలు బిగించి బరిలోకి దిగినట్టుగా సన్నద్ధం గా  ఉన్నారు. లారీ వచ్చి ఆగడంతోటో తోపులాట మొదలైయ్యింది. అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు మొదలైనాయి.  రైతులకు రైతులే గొడవపెట్టుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు. చొక్కాలు పట్టుకుంటున్నారు. ఎంత ఘోరం. మరి ఎరువులు అందరికి కావాలి. పని వదిలేసుకుని వస్తే  ఎరువులు లేకుండా ఖాళీ చేతులతో ఇంటకి వెళ్ళడం యిష్టం లేదు. యుద్ధం లో  దిగిన వాడికి విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా వున్నారు.
ప్రభుత్వాలు మాత్రం కడుపునిండిన మాటలు  చెబుతున్నారు. తమది మాత్రమే రైతు ప్రభుత్వమని. తమ ప్రభుత్వం రైతుకు చేసిన పనులు మరే ప్రభుత్వం చేయలేదని నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇంతకి వీళ్ళు చేసిందేంటో ఎవరికి అర్థం కాదు. నిజానికి ఆ మాట అన్నవాడికి కూడా అర్థం కాదు.
సంక్షేమ పథకాలన్నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదీ చేస్తాం ఇదీ చేస్తాం అంటూ బాకాలు ఊది, వీళ్ళు చేసేది  ఏమిటో చూస్తె మతి పోతుంది. ఆరుకాలం కష్టపడి వ్యవసాయం చేసే వాడికి ఒక కిలో బియ్యం ఇస్తారు. రెక్కలు ముక్కలు చేసుకుని కంటిమీద కునుకులేకుండా కాయకూరలు పండిస్తే  ధర మాత్రం ఎవరో నిర్ణయిస్తారు. 7 గంటల కరెంట్ అంటారు. అదీ కూడా యిస్తారా లేదా అన్నది ఎవరకి వారే తేల్చుకోవాల్సిందే.  ప్రపంచంలో అందరూ ఎవడి వస్తువులకు  వాడే ధర నిర్ణయిస్తారు. కాని ఒక్క రైతుకు మాత్రము తను పండించిన పంట, ధాన్యం వంటి వాటి ధర ఇతరులు నిర్ణయిస్తారు. ఇక్కడ రివర్స్. అదే ఎందుకంటే మార్కెట్లో ఉన్న వాళ్ళ పని యిదే. రైతుకు అలా కాదు పండి పంటను అమ్ముకుని మళ్ళీ పండించడానికి పరిగెత్తాలి. ఎంత కష్టం. అయినా వాడికి వీళ్ళే తిండి పెడుతున్న బిల్డప్‌లు యిస్తారు. ప్రపంచానికి అన్నం పెట్టిన వాడు రైతు. ఆ రైతును కోలుకోకుండా చేస్తున్నారు. అదీ సాటి మనిషే కావచ్చు. అందర్నీ సృష్టించిన దేవుడు కావచ్చు. అదేలాగంటే, కావలనిన సమయంలో వర్షం పడదు. రెక్కలు ముక్కలు చేసుకుని తనకు చేతనైనా పరిధిలో పంట పండిస్తే  తీరా చేతికి వచ్చేసమయంలోనే భీకరంగా వర్షాలు పడతాయి. పంటమొత్తం వర్షార్పణం. అదీ నేటి భారతదేశ రైతు పరిన్థితి. ఇలాంటి పరిన్థితులు ఇంకే దేశంలోనైనా ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయా? అన్న విషయం మనకు తెలియదు.
అలాంటి పరిన్థితులమధ్య ఎరువులకోసం వచ్చాడు మన రైతు. కొంచెం దూరంగా నిలబడి తోపులాటను చూస్తున్నాడు పాపం. తాను పోట్లాడతున్నది తన తోటి రైతుతోనే అన్న విషయం విస్మరించి కలబడి ఎగబడి పోతున్నారు. లారీ ఊగిసలాడుతు ఆగింది. బరవుకు కిర్రు కిర్రు మని అరుస్తోంది. దానికి కట్టిన తాళ్ళు విప్పారు. ఇంకా తోపులాట ఎక్కువైంది.
ఇంతలో “అవురా నువ్వు నాకే ఇయ్యకుంట అమ్ముకుంటావురా? అన్నకు చెబుతా” గట్టిగా అరుస్తున్నాడు ఒకతను.
“ఏం చెయ్యమంటారండి.. పాపం నిన్నటి నుండి రైతులు లైనులో నిలబడి వున్నారు. వాళ్ళను కాదని మీకిమ్మంటే ఎలా” అంటున్నాడు దుకాణం అమ్మకం దారుడు.
“నేను చెప్పేది చెప్పినా, ఆ పై  నీ యిష్టం” అన్నాడు నిష్టూరంగా.
చేసేది లేక కొన్ని బస్తాలు వాళ్ళపరం చేసాడు. మరి ఎమ్మేల్యే అంటే మాటలా?
తరువాత ఇంకో చోటామోటా నాయకుడు. పాపం ఎవర్ని  కాదనగలడు. అందర్నీ ఒప్పించాలి.
ఆఖరికి రైతులను మాత్రం బెదిరిస్తాడు. “ఏందయ్యా కొద్దిగా ఆగలేరా?”
“రైతులే నీకు కనిపిత్తలేరు. వాళ్ళనే ఆగమంటున్నావు. వాళ్ళను చూసీ భయపడి యిస్తున్నావు. మేము ఇక్కడ కాళ్ళు నొప్పులు పుట్టేలా  నిలబడి నిలబడి చస్తున్నాం. నువ్వేమో ఆగలేరా అంటున్నావు. మళ్ళీ మేము పోయి పనిచేసుకోవాల్నా వద్దా. మా బతుకులు మీ ముంగట్నే తెల్లారుతాయినయి” అన్నాడు కడుపుమండిన  ఓ రైతు.
రైతులకు ఇవ్వడం మొదలు పెట్టాడు. తోపులాట ఇంకా ఎక్కువైంది. లైను కోసం నిలబెట్టిన చెప్పులు రాళ్లు అన్నీ చెల్లా చెదురు అయిపోయాయి.  వాటిని పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. పాపం మన లచ్చుమయ్య బీరిపోయి చూస్తున్నడు ఇయ్యాల సుత ఎరువులు దొరకుతాయా లేదా? అన్న భయం అతడి కళ్ళలో కనిపించింది.   కాని అలా జరగడానికి వీళ్ళేదు ఈ రోజు ఎలాగైనా  సరే ఎరువులు తీసుకుని వెళ్ళాలి. అని ఆలోచిస్తూ లచ్చుమయ్యా సుత లైన్ల జొరబడ్డాడు. వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి జరుగుతోంది లైను. ఆ వత్తిడికి బక్కగా ఉన్న రైతులు ఆ తాకిడికి తట్టుకోలేక లైను నుంచి బయటికి వచ్చేస్తున్నారు. అయినా వారు మళ్ళీ లైనులో నిలబడ్డానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఒంటిమీది బట్టలు స్థానభ్రంశం చెందుతున్నాయి.
హఠాత్తుగా ఓ కలకలం బయలుదేరింది. ఉన్న లైను వదిలేసి రైతులు లారీ వైపు పరిగెడుతున్నారు.
“అరే ఏమయిందిరో” అనుకుంట లచ్చన్న లారీ చూశాడు.
అంతే. బీరిపోయిండు. రైతులు లారీ ఎక్కి ఎరువుల బస్తాలు భుజాన వేసుకుని వెళ్ళిపోతున్నారు.
“గిదేం పనిరో గిట్ల చెయ్యవడ్తిరి”
“మరేం చేత్తరు వాళ్ళేం చేస్తున్నారు. అచ్చిన లారీ లోడు రైతులకు ఇయ్యకుంట ఆళ్ళు ఏం జేత్తున్నరు. రైతలకు కడుపు మండుతది. రెండురోజుల సంది ఇక్కడే పండుకుని ఉన్న వాళ్ళకు సుత ఒక్క బత్త ఎరువు దొరకపాయే. ఇంకేం చేత్తరు” అనుకుంటా ఓ రైతు తలకు రూమాలు చుట్టు బిగించి లారీదిక్కు ఉరికిండు.
నిజమే ఎగిలివారంగా నాలుగుగంటలకు వచ్చిన తనకే కడుపు మసిలి పోతాంది. రెండు రోజులసంది ఉన్నోనికి ఇగ ఎట్ల ఉంటది. మరి ఇది మంచిదా కాదా అని ఎవలు ఆలోచించడం లేదా? సరే మనం చేనింది తప్పైతే  వాళ్ళు చేసింది  కుడా తప్పే కదా? ఇగ రైతులు ఇట్ల చేసుడు తప్పు కానేకాదు అనుకున్నాడు లచ్చుమయ్య. కానీ ప్రస్తుతం తను ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేక లారీ మీదినుంచి ఖాళీ అవుతున్న ఎరువుల బస్తాలను చూస్తు ఉండిపోయాడు. తను కూడా వెళ్ళి ఆ గుంపులో కలవడమా? లేదా? ఆలోచిస్తున్నాడు లచ్చుమయ్య.

 

— ఓదెల వెంకటేశ్వర్లు

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)