విఫల స్వప్నాలు, వైయక్తిక వేదనల ప్రతిబింబం ఆధునిక మళయాళ కథ

A house hotel boat on the backwaters in Kerala

రెండో భాగం

ఆధునిక మలయాళ కధ  

ఒకానొక కాలంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాలు మలయాళ కధా సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి .ఆ సామాజిక పరిణామాలు వల్ల ఏర్పడిన సామాన్య ప్రజల జీవిత వ్యధను శక్తివంతంగా చిత్రీకరించగలగింది అనేదే ఆధునిక మలయాళ కధ తాలూకు విజయం –కీర్తికి కారణం కూడా. అందువల్ల కేరళలో నెలకొన్న సామాజిక స్దితిగతులు గురించి సంక్షిప్తంగా నైనా  సమగ్రంగా చెప్పటం తప్పదు. ఈ సామాజిక స్దితిగతులు భారత దేశంల్లోని ఇతర ప్రాంతాల్లో నెలకొన్నవాటికన్నా చాలా భిన్నము . గొప్ప రచయితులైన ఎం. టి. వాసుదేవన్ నాయర్ మొదలగువారి రచనల తెలుగు అనువాదాలను చదివి ఆస్వాదించాలంటే అలనాటి సామాజిక స్దితి గతులు గురించి ఒక కనీస పరిజ్ఞానం  ఉండాలిసిందే.

కేరళలోని అగ్రకులస్తులు [హిందువులుగురించే ఇక్కడ ప్రస్తావిస్తునాను ],నంబుద్రి ,నాయర్[మీనోన్ ,పణిక్కర్ మొదలగువారు  వారు కూడా నాయర్లే –అగ్రకులస్తులు ]నంబుద్రి అంటే బ్రాహ్మణుడు –ఈ కులంవాళ్ళు తరతరాలుగా భూస్వాములు  –పితృసామ్య వ్యవస్ద గలవాళ్ళు- ఉమ్మిడి కుటుంబంగా జీవించిన వీళ్ళ కుటుంబాల్లో అన్నదమ్ములు కలిసి వుంటేవారు –ఆస్తి పెంపకం ఉండదు -. ఇంటికి పెద్దవాడు –తండ్రి లేదా  తండ్రి లేకపోతే పెద్దన్న ఆస్తి వ్యవహారాలు ఇంటి విషయాలు చూసుకునేవారు.  అలనాటి సాంప్రదాయనుసారంగా కావ్యాలు నాటకాలు తర్కం మొదలైనవి నేర్చుకున్న వీళ్ళు విద్యావంతులు –కవులు ,కళా సాంస్కృతిక పోషకులు. కాని వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇంటికి పెద్ద కొడుకు మాత్రమే నంబుద్రి యువతిని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకొస్తారు –పెళ్ళి ఒకటో రెండో ,ఎన్నో –ఆ నంబుద్రి భార్య ద్వారా కలిగిన పిల్లలకే ఆస్తి హక్కు ఉంటుంది . మిగతా కొడుకులు వాళ్ళుకు తోచినటు ఇష్టమైన ఇతర కులస్తులతో [ముఖ్యంగా నాయర్ మీనోన్ యువతులతో] సంబంధం పెట్టుకుంటారు.సంబంధం అంటే అందరికీ తెలిసిన లైంగిక సంబంధమని అర్ధం . మంత్ర తంత్రాలతో కూడిన పెళ్ళి కాదు. తాళి కట్టు ఉండదు –అసలు తాళియే ఉండదు. అలా సంబంధం చేసుకున్న యువతి తన ఇంటిలోనే ఉంటుంది. నంబుద్రి, ఆ పిల్ల ఇంటికి రాత్రి వచ్చి పొద్దునే లేచి వెళ్ళి పోతాడు. పిల్లలు కలిగినా ఆ పిల్లలు తల్లితో పాటు తల్లి ఇంటిలోనే ఉంటారు –నంబుద్రి ఇచ్చినది పుచ్చుకోవటమే తప్ప హక్కు ఏది లేదు. అలనాటి నాయర్ సమాజంలోని వివాహ వ్యవస్ద దీనికి అనుగుణంగానే ఉంటేది .ధనవంతులైన గొప్ప నాయర్ కుటుంబాలు ఉంటేవి ఆ రోజుల్లో. మాతృస్వామ్య వ్యవస్ద పాటించేవారు నాయర్ ,మీనోన్ సమాజాలు . ఆస్తి మొత్తం ఆడపిల్ల పేరు మీదే ఉంటేది.మేనమామ ఇంటి పెద్ద –ఆస్తి వ్యవహారలంతా అతడే చూసేవారు. తరవాడు అనబడే నాయర్ మాతృస్వామ్య వ్యవస్డలోని ఉమ్మిడి కుటుంబంలో ఇంటి పెద్ద మేనమామ ,అతని తల్లి అక్కచెల్లిల్లు, తమ్ముళ్ళు,  మేనకోడళ్ళు , మేనల్లళ్ళు –అందరూ కలిసి ఉంటేవారు –నాయర్ మీనోన్ సమాజంలోని వివాహ వ్యవస్ద, సంబంధమే. ఇంటి పెద్దవైన మేన మామ భార్య ఆవిడ ఇంటిలోనే ఉంటుంది. ఇంటివ్యవహారాలు చక్కబెట్టుకున్న అతడు రాత్రి భార్య ఇంటికి వెళ్ళి పడుకొని పొద్దునే తిరిగి తన ఇంటికి వస్తాడు . తరవాడులోని ఆడవాళ్ళకు పుట్టిన పిల్లలందరూ ఆ తరవాడులోనే బ్రతుకుతారు. ప్రతి ఆడపిల్లకి కూడా ఆస్తి మీద హక్కు ఉండేది ఇరవై ముప్పై మనుషులు వున్న తరవాడు సాధారణమే . వాళ్ళు కోసం పెద్ద పెద్ద ఇల్లు /వాటాలు ఒకే ప్రాంగణంలో ఉండేవి ,ఒకే వంట గదితో.

ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు ముఖ్యంగా తీయలు శ్రీ నారాయణగురు వల్ల ప్రభావితులై సామాజిక రంగంలో ముందడుగు వేసారు అప్పటికే. ముస్లింలు క్రిస్టియనులు ముఖ్య ధారలో కలిసిపోయినవాళ్ళే  . వీళ్ళు కాక తమిళ నాడు నుంచి వలస వెళ్ళి కేరళలో స్ధిరబడ్డ అరవ బ్రాహ్మణులు [అయ్యర్ ]కర్నాటకవాళ్లు కూడా సమాజంలో ఉండేవారు కనుక సాహిత్యంలో కూడా కనబడుతారు .

ఉమ్మిడి కుటుంబపు ఉక్కు హస్తాలనుంచి వ్యక్తి స్వతంత్రుడైన కాలం ఇది .అలా ఉమ్మిడి కుటుంబ వ్యవస్థ  నుంచి బయిటికి వచ్చి తన విధి తనే స్వయం నిర్ణయించడానికి ప్రయత్నించే మేనల్లుళ్ళ వైయక్తిక అనుభవాల నుంచి పుట్టుకొచ్చిన భావుకతే ఈ తరం రచయితుల బలం . జీవితాన్ని గెలవాలనే ఆతృత ,ఆ ప్రయత్నంలో అందిన స్వల్ప విజయాలు ఎక్కువ నైరాశ్యం ,ఆత్మనింద ,ఛవి చూసిన మోసాలు కక్ష మొదలైన భావాలు ఈకాలం కధల్లో కనబడుతాయి .

ఆర్ధిక సామాజిక సమస్యలు అప్రసక్తం కాలేదు కాని సామాజిక సమస్యలకన్నా సొంత సమస్యలకూ కలలకూ వేదనలకు ప్రాధాన్యం ఇచ్చారుఈ కాలపు కధకులు .  ఆకలి బాధ కన్నా హృదయ బాధ భరించలేనిదిగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే కధ ‘’మానసిక జీవితానికి   ప్రచురణా కేంద్రమైంది ‘’ తన హృదయం మీద తగిలి  ప్రతిఫలించే అనుభవాలకు తన గుండె రంగు కలిపి చిత్రీకరించారు రచయితలు –అలా కధ ఒక భావ గీతానికి దగ్గరైంది.

కొన్ని మానసికావస్థలను అనుభవ ముహూర్తాలను ఆవిష్కరించవలసి వచ్చినప్పుడు నిర్మాణ చాతుర్యం అనిర్వార్యమైంది. అంతర్భావావిష్కారం కోసం మాటలనూ  బింబాలనూ ఆశ్రయించవలసి వచ్చింది. ఎత్తు గడ కధ ,ముగింపు మొదలైనవాటితో బంధించబడిన ఒక కధ చెప్పడానికి కాదు ,కధ ద్వారా కొన్ని వైయక్తికానుభూతులు అందించడానికి ప్రయత్నించారు ఈ కాలపు రచయితలు . ఇలా కధలకు కావ్యాత్మ ఇచ్చిన రచయితలు టి.పద్మనాభన్ ,ఎం.టి.వాసుదేవన్ నాయర్ ,కమలాదాస్ -1950 దశకపు ద్విదీయార్ధంలో జరిగిన పరిణామం ఇది. కాని వైయక్తికానుభవాల ఆవిష్కారం అని చెప్పగానే వాళ్ళు సామాజిక సమస్యలను నిర్లక్ష్యం చేశారని అనుకోకూడదు వైయక్తికానుభవం సామాజిక సమస్యనుంచి ఉత్పన్నమైనదే.

Mt_vasudevan_nayarఎం. టి. వాసుదేవన్ నాయర్ కధలు :[1933—జననం ]

ఈ కలఘటపు కధా చరిత్ర వీక్షణం  ఎం. టి. గారి కధలతోనే ప్రారంభించాలి.శిధిలావస్దకి చేరే ఒక సామాజిక స్దితిని దానివల్ల ఉత్పన్నమైన మానసిక సంఘర్షణలను కవితాత్మకంగా పాఠకుల  గుండెకి అంటుకునే విధంగా చిత్రీకరించగలగటమే   ఎం. టి. కధల గొప్పతనం.శిధిలావస్దకి చేరే తరవాడులు ,వాటిలో అవగణనకీ పీడనకీ గురయే మేనల్లళ్ళు వాళ్ళ వైయక్తిక ప్రపంచం –ఇవీ ఎం. టి. కధా ప్రపంచం. అతడు ఒంటరివాడైన వ్యక్తి కధే చెబుతున్నాడు . చిన్నపిల్లవాడుగా వున్నప్పుడు అనుభవించిన నిర్లక్ష్యమూ దారిద్ర్యమూ దీనికి కారణాలు. చిన్న పిల్లాడుగా వున్నప్పుడు అవసరాలు ఆనందాలు నిషేధింపబడిన వాడు యవ్వనంలో జీవితాన్ని గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రమశిక్షణతో కూడిన బ్రతుగు గడిపే శక్తిని కోల్పోయి తీవ్ర జీవితాశక్తి తో ముందుకు సాగుతునాడు –శాంతి పర్వం ,సంధ్య వెలుగు, నీలి కొండలు ,మొదలగు మొదటి కధల్లో ఇలాంటి పాత్రలు కనబడుతాయి –సామాజిక పరిస్డితుల పట్ల కక్ష ,ఆత్మ నింద వాళ్ళ ముఖ ముద్రలు. మానసిక సంఘర్షణల చిత్రీకరణ అనే విశేషణానికి అర్హమైన ఇతని కధల్లో శిధిలమయే తరవాడు ఎప్పుడూ  ఉంటుంది.

కధా నేపధ్యం నగరమైనా ఎలాగోలా తరవాడు గ్రామీణ జీవితం ,గ్రామీణ వాతావరణం మొదలైనవి కధల్లోకి చొచ్చుకువస్తాయి –ఇతని కధలకు నిడివి ఎక్కువ. ప్రతి కధలోను కచ్చితమైన సామాజిక నేపధ్యం ఉంటుంది. స్థల కాల సామాజిక స్ధితులు కధల్లోని విడతీయలేని అంశాలు –అందువల్లనేమో కధను మనం అనుభవిస్తాం –అనుభూతి పొందుతాం. భావాత్మకమైన బింబాత్మక మైన  కధలు ఎం. టి. వ్రాసిన కధలు. ఎక్కువ కధలు ‘’అతడు ‘’అనే మాటతోనే మొదలవుతాయి –కధా నాయకుడు అతడే –పేరుకుడా ఉండదు. అనవసరమైన ,అర్ధ రహితమైన ఒక మాట కూడా అతని కధల్లో కనబడవు.

ఆత్మలో కవిత్వం లేనివాడు కధ వ్రాయకూడదు అనే తన నమ్మకాన్ని బయిట చెప్పటమే కాదు తన రచనలు ద్వారా ఋజువు చేసినవాడు కూడా టి. పద్మనాభన్ [జననం 1931]అనే రచయిత. సరళమైన కధాఖ్యాన శైలి ఇతనిది.

ఈ ఇద్దరి రచనా వారసత్వాన్ని కొనసాగించినా ,ఈ కధకులంత సహృదయామోదం పొందని రచయితలు కొందరున్నారు. గొప్ప కధలు వ్రాసినా మర్రి చెట్టుకృంత మొక్కల్లా నిలిచిన ఈ రచయితలు కూడా మలయాళ కధా వికాసానికి బాట వేసినవారే.ప్రముఖ రచయిత్రి మాధవికుట్టి [కమలా దాస్]గురించి ప్రస్తావించే ముందు ఇలాంటి కొందరు ప్రముఖ రచయితలు గురించి ప్రస్తావించాలి. –వాళ్ళలో ముఖ్యుడు ఎన్. పి. మొహమ్మదే. మతం తాలూకు సరిహద్దులు దాటిన అధికారం,జీవితం తాలూకు మానసిక ప్రశాంతతను పోగొట్టే మూఢ నమ్మకాలు ఆచార సాంప్రదాయాలు,మామూలు మనుషులను ప్రలోభాలు వల్ల మోసగించే తంగళ్ [ముస్లిం పెద్దలు ] బహుభార్యాత్వం వల్ల కలిగే నష్టాలు ,భోగాలకు ముసుగుగా నిలిచే మత నియమాలు వగైరాలను కొన్ని కధల్లో హాస్యంతోనూ ,మరి కొన్ని కధల్లో నిశిత విమర్శ తోను మిళితం చేసి రచన చేసాడు ఇతడు. ముస్లిం మిత్రుల  వ్యాఖ్యానాలు ద్వారా సామాజిక జీవితం తాలూకు అర్ధం వెతుకుతునాడు ఈ కధకుడు . ఒక కధలో రచయిత ఇలా అంటాడు

‘’మరణం ఎదుగుదలను మేం జీవితం అని అంటున్నాం –మీకు తెలియనిది అల్లాహుకు తెలుస్తుంది –మొక్కలను చూడండి. అవి ఎదుగుతున్నవి ,పుష్పించడానికీ కాయలు ఇవ్వడానికీ మాత్రమే.  మరణించడంకోసం ఎదుగుతున్నారు మీరు.  మీరు పుట్టగానే నిజంగా మీరు చనిపోతున్నారు –మీ జననమే మీమరణం ‘’

సామాజిక జీవితమే ఇతని కధావస్తువు

విషాద భావంతో మిళితమైన తీక్ష్ణ వైయక్తిక ప్రపంచం ఎన్. మోహనన్[1933 –1999 ] కధా ప్రపంచం –ఆత్మనిష్ట మైన అనుభవాల ప్రపంచం –వైయక్తికమైన సత్యాన్వేషణలు అవి. మరణం సృష్టించే విషాదం ఇతని కొన్ని కధల్లో చూడవచ్చు. రాజకీయభావాలకు ,కులానికి మతానికి అతీతమైన మానవతా కోణం ఇతని కధల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. అతి తక్కువ కధలు వ్రాసిన ఇతడు కధా నిర్మాణంలో  ,మనసులోని భావానికి అనుగుణ మైన రూపం కధే తీసుకుంటుందని వదిలేసేవాడు. క్షేత్రోద్యోగి కనుక ,తనకు సుపరిచితమైన క్షేత్ర జీవితంలోని అనుభవాలనూ అలనాటి సంబంధం వ్యవస్థ వల్ల నెలకొన్న’ లూస్ ‘  లైంగిక సదాచారం  మొదలైనవాటిని ఆధారంగా చేసుకొని మంచి కధలు వ్రాసిన రచయిత ఉన్నికృష్ణన్ ,పుతూర్. సీదాసాదాగా కథనూ  పాత్రల మానసిక స్డితులనూ  వివరిస్తాడు ఈ కధకుడు.

కేవలం 12 కధలు వ్రాసి 34వ ఏట చనిపోయిన రాజలక్ష్మి షి [1930—1965] ఈ తరంలోని ఒక గొప్ప రచయిత్రి. స్త్రీల బాధలు ఆత్మ వ్యధలు ,అలనాటి సామాజిక గృహ వాతావరణంలో స్త్రీలు ఎదుర్కొనే సవాళ్ళు సంఘర్షణలు ఆమె కధలకు ఆధారం.

సంపూర్ణం కాని వ్యక్తిత్వాలూ ఆశ్చర్యకరమైన జీవిత సంఘటనలూ సి.వి. శ్రీరామన్ కధలకు ప్రాణంపోసే అంశాలు. వ్యక్తులకు సంఘటనలకు ఇతని కధల్లో సవిశేషమైన ప్రాధాన్యం ఉంటుంది.చాలా శ్రద్ధతో కధకి ఇతివృత్తం  అల్లుతాడు ఈ రచయిత. ఇతని కధానేపద్యం కేవలం కేరళ రాష్ట్రానికే పరిమితం కాదు. అతని ప్రసిద్ధ కధ ‘వాస్తు హార ‘ కి నేపధ్యం బెంగాల్. వ్యత్యస్తమైన రెండు సంస్కృతుల సంఘర్షణల సమన్వయ తలాలను ఆవిష్కరిస్తోంది ఈ కధ. వృతి రీత్యా వక్కీలైన ఇతడు న్యాయవృత్తికి సంబంధించిన మంచి కధలు కూడా వ్రాసారు. తమ దృక్పథా నికి  అనుగుణంగా మంచి కధలు వ్రాసి మలయాళీ పాఠకుల  మన్నెన పొందిన రచయితలు ఎందరో ఉన్నారు ఈ తరంలో –కాని రచయితుల పేర్లు వారి కధలు, సంపుటాలు ,వివరించటం ఈ వ్యాసం తాలూకు ఉద్దేశం కాదు కనుక కొత్త భావాలకు కాని కొత్త రూపాలకు కాని ఊపిరి పోసి మలయాళ కధను ఒక మలుపు తిప్పిన రచయితలు గురించే వివరించాలని అనుకున్నాను కనుక కొందరి పేర్లు [వాళ్ళూ గొప్ప రచయితులే– అయినా ప్రస్తావించటం లేదు ]

Kamala_dasభావుకతే మాధవికుట్టి[1934—2007] [కమలాదాస్ ]ప్రత్యేకత  అని చెబుతే అది నిజం కాదు. జీవితమంటే ఆమెకున్న కచ్చితమైన వాస్తవిక స్పృహ,రుచికరంకాని నిజాల ముఖాలను దాచే ఆదర్శవాదుల తిరస్కారం —ఇవీ ఆమె కధలను అస్వస్డత రేకెత్తే  అనుభవాలుగా మలిచాయి. అందమైన జీవితనిమిషాలు చాలా అరుదుగా కనబడుతాయి ఆమె కధల్లో. ఆమె కధల్లో ఎక్కువ కధలు నగర నేపధ్యం తో వ్రాసినవే –కపట భరిత జీవితాలు గురించి జీవితాన్ని అడ్జస్ట్ మెంట్ గా  మార్చిన బ్రతుకులు గురించి వ్రాసారు ఆమె . పల్లెలు ,పల్లె మధురిమలు ఆ కధల్లో అప్పుడప్పుడు జ్ఞాపకాలుగా స్వప్నాలుగా కనబడవచ్చు.తమది కాని బ్రతుకు బ్రతక వలసిన ధనికుల ధర్మ సంకటాలు ఆమె కధా ప్రపంచానికి ఒక  ప్రతేక పరివేషంగా నిలిస్తోంది.

దారితప్పిన దాంపత్యాల అణిచివేసిన రోధనా స్వరాలు కమలా దాస్ వ్రాసిన ఎక్కువ కధల్లో అంతర్ధారగా కనబడుతాయి. పరస్పరం మోసగించి బ్రతికే  భార్యా భర్తలు –భర్త నుంచి తనకు సంపూరణమైన ప్రేమ అందనప్పుడు భార్య ఒక ప్రియుడు కోసం వెతుకుతుంది. –భర్తను మోసం చేస్తుంది.  భర్తను  మోసగించాననే నేర చింత వల్ల సతమతమయే వాళ్ళు కొందరు –నేరచింత కలగనివాళ్ళు రతీలోకంలో స్వతంత్రంగా విహరిస్తారు –ప్రేమ ,రతి –రెండూ ఒకటి కాదు అని చెబుతాయి ఈమె కధలు – తన కధలు ద్వారా కమలా దాస్ మన ముందు వుంచే ప్రశ్న ఒకటుంది. అది –

తనను ఎన్నెడూ మనస్ఫూర్తిగా ప్రేమించని  భర్తకి లైంగికంగా లొంగిపోవట మనేదా లేకపోతే తనను నిజంగా ప్రేమించే పరపురుషుడికి సంతోషం తో స్వయం అర్పించుకోవటమా  న్యాయం అనే ప్రశ్న అది. కామాసక్తి లేని ప్రేమ వాస్తవికమా? స్త్రీ తాలూకు జీవిత దృకోణం వేరు. ఆమె జీవితాన్ని, పురుషుడు చూసినట్లు చూడదు;అనుభవించదు. ఆమె కోరికలను ఆశలను పోల్చటంలో పురుషుడు విఫలమవుతునాడు –ఈ విశాల దృక్కోణం నుంచి వీక్షిస్తే కమలాదాస్ స్త్రీ వాదియే. సరళంగా గుండెను హత్తుకునే  రీతిలో వ్రాస్తారు. కమలాదాస్ కధల్లోని స్త్రీ పాత్రలు అలనాటి మలయాళీ సమాజానికి సంబంధించినవని చెప్పలేము –ఆమె కధల్లో కనబడే స్త్రీపాత్రలు విశ్వ మహిళలు. అందువలనే ఆమె కధలు ప్రపంచ ప్రాచుర్యం పొందాయి . కమలాదాస్ రచించిన  కొన్ని ముఖ్య కధలు తెలుగులో లభ్యం .

220px-Sara అభ్యుదయ ఆదర్శాల వెలుగులో కూర్చుని రచన చేసిన కధా రచయిత్రి సారా జోసెఫ్ [జననం 1934 ]జీవిత బంధాల్లోని కాలుష్యమూ వ్యక్తి జీవితంలోని దర్మ సంకటాలు ఈమె కధలకు ఇతివృత్తం. అలాగైనా సరే బ్రతుకు బ్రతకటం కోసమే అనేది ఆమె అభిప్రాయం. స్త్రీవాదానికి సంబంధించిన కధలు ఈమె వ్రాయలేదు ;కాని భారతీయ సామాజిక పరిస్డితిల్లో స్త్రీలు అనుభవించే అణిచివేతలనూ దురితాలనూ పోలిస్తునారు ఈవిడ. కధ చెప్పే టెక్నికు కన్నా కధ మీదే ఈ రచయిత్రి తన శ్రద్ధ కేంద్రీకరిస్తునారు.

ఈ తరానికి చెందిన మరో ముఖ్య కధకుడు పద్మరాజన్ [1945—1991 ]. ఎం.టి.లా కాల్పనికుడు కాదు. ఆధునికత యొక్క దర్శనము ప్రయోగాత్మకత కనబడదు అతని రచనల్లో. అతి సాధారణ జీవితాల్లోని  అసాధారణ ముహూర్తాలు  కనిబెట్టే అతని రచనలు వాస్తవికతకి అతి దగ్గరగా వుంటాయి. విషయం ఏదైనా –మనకు నచ్చనివైనా నిరాడంబరంగా ఆవిష్కరించే రీతి అతనిది.  ఇతడు చాలా తెర కధలు కూడా వ్రాసారు కొన్ని కధల్లో రతి యొక్క విస్తృత ఆవిష్కారం కనబడుతుంది

ఈ కధా రచయితల్లో ఎందరో ఇంకా రచనా రంగం మీద సజీవంగానే వున్నారు –కాని 1960లోనే వ్యత్యస్త రూపభావాలతో కూడిన వీళ్ళ రచనలు వెలుబడ్డాయి.  కవిత్వంలోనూ నవలలోనూ అలా కధల్లో కూడా ఆధునికత రూపు దిద్దుకుంటూనే ఉంది –కాని కధలోని ఆధునికతకి సమాంతరంగా రూపు దిద్దుకున్న నవీన కధ వైపు తిరుగుతాం ఇక

పైన చెప్పబడిన రచయితలు రచనా రంగం మీద అడుగు పెట్టిన కాలంలోనే రచనలు ప్రారంభించిన కొందరు కధా రచయితలున్నారు –అలనాటి మలయాళ సాహిత్యంలో నవీనధార సృష్టించినది ఆ  ధారని  సజీవంగా నిలిపినదీ వీరే. ఓ. వి.విజయన్ ,ఎం. ముకుందన్,కాక్కనాడన్ ,సేతు పునత్తిల్, కుంజబ్దుల్లా, ఆనంద్ మొదలైనవాళ్ళు వీరు –ఆధునిక కధకులు అని చెప్పబడే కధకులతో పాటు రచన ప్రారంభించిన వీళ్ళు భిన్నమైన ఒక భావుకతను  సృష్టించారు –అంతే .

ఫ్రెంచ్ ,జెర్మన్ ఆంగ్ల భాషల్లోని ఆధునిక సాహిత్య ప్రభావం వీళ్ళలో కనబడుతుందిసార్త్రే,  కాఫ్కా,  నీషే  మొదలగు రచయితుల దార్శనికత్వం కొంతవరకు వీళ్ళ అభిరుచిని ప్రభావితం చేసిందనే చెప్పాలి

“ అప్పటకే సమాజంలో నెలకొన్న మూల్యాలను సామాజిక వ్యవస్దనూ తిరస్కరించిన ఈ కధకులు జీవితం తాలూకు అర్ధ రాహిత్యం గురించి వ్యర్ధత గురించి వ్యక్తపరచడానికి ప్రయత్నించారు. వాళ్ళు యదార్థ్యంగా దర్శించినది వ్యక్తిని కాని సమాజాన్ని కాని కాదు ,మానుషి అనే ప్రతిభాసాన్ని– ఆలంబ రహితమైన మానవావస్థ  తాలూకు దైన్యాన్ని –ప్రేమ వాళ్ళ దృష్టిలో కేవలం ఒక దైవ  ప్రేరణ – నగరాల్లో వేర్లు కోల్పోయిన మానుషి యొక్క ఒంటరీతనం  అతని నిసహాయ అస్తిత్వవేదన ,అస్థిత్వం గురించిన అన్వేషణ మొదలైనవి కధా వస్తువులుగా మారాయి. అస్తిత్వ వాద జన్యమైన ఆతృతలను వ్యధలనూ ఆవిష్కరించటం కోసం కధలను కట్టుకధలుగానో ‘ఇకువేషన్ ‘గానో మార్చారు వాళ్ళు “.

కాని ఇది అతి కొంత కాలం మాత్రమే నిలిచింది. ప్రతిభావంతులైన ఈ కధకులు అతి తక్కువ కాలంలోనే తమదైన రచనా మార్గాలు కనిబెట్టారు –మలయాళ కధకి వ్యత్యస్తమైన అనుభూతుల  కవాటాలు తెరిచారు.

ఆధునిక కధకుల్లో ప్రాతస్మరణీయుడు కాక్కనాడన్ [జోర్జ్ వర్గేస్]. ఆధునికత యొక్క కొన్ని లక్షణాలు మాత్రమే ఇతని కధల్లో కనబడుతాయి. కాని ఎం. టి. తో పాటు అందరి సమకాలీన రచయితుల దృకోణాలనిర్మాణ శైలీల ప్రభావం ఇతని కధల్లో కనబడుతుంది . ఎంతో కాలం తనను మోసుకు తిరిగిన తరువాత  పాతదై నిష్ప్రయోజనమైన  పాదరక్షలను ప్రతీకగా తీసుకొని ఒక వృద్ధుని  మనోభావాలను చిత్రీకరించిన ‘’పాతబడటం’’ అనే కధ [1960కన్నా ముందు]చెప్పుకోదగ్గది. సమాజంలోని సదాచారపు డొల్లతనం బయిట పెడుతాయి ఇతని కధలు .

మరో ముఖ్య కధకుడు ఓ. వి. విజయన్ [1931 –2005]—ఇతడు గొప్ప కార్టూనిస్టు కూడా. ప్రతీకాత్మకంగా  కధ చెబుతాడు ఇతడు. ఆకస్మికం  గానో అప్రతీక్షితం గానో జీవితాన్ని పరిణతిలోకి తీసుకొని వెళ్ళే భౌతీకాతీత  నియోగాలు గురించిన అస్వస్థతలు ఇతని కధల్లో అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతాయి. ఇతని కధలను రెండు విభాగాలుగా విభజించవచ్చు. సమకాలీన జీవితానుభవాలను ఒక కార్టూనిస్టు దృక్పదంతో అతిశయోక్తితో కాని  న్యూ నోక్తితో కాని గీసినకధా చిత్రాలు  ఒక విభాగానికి చెందినవి అయితే జీవితంలోని  మనశ్శాంతిని పోగొట్టే దార్శనిక సమస్యల నుంచి పుట్టుకొచ్చిన  కధలు రెండో విభాగానికి చెందుతాయి

చాలా భిన్నమైన ఇతివృత్తాలతో రచన చేసిన కధకుడు ఆనంద్ [పేరు –పి. సచ్చిదానందన్ – జననం 1936]220px-Sachidanandan

కధకుడుకన్నా నవలిస్టుగానే ఇతనికి కీర్తి ప్రతిష్టలు ఎక్కువ. కధల్లోనైనా ,నవలోనైనా తన చారిత్రిక దృక్పదం ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు ఈ రచయిత. మౌలికంగా ఇతడు ఒక త్వాత్వికుడు. తన ఆలోచనలను వెలువరించే  మాధ్యమం అతని సాహిత్యం. వ్యాసాలు వ్రాసే బదులు సంఘటనలను కాని కధాపాత్రలను కాని ఆధారం చేసుకొని తన ఆలోచనా ధోరణిని వ్యక్తపరిస్తాడు అతడు. తన ఆలోచనా ధోరణికి అనుగుణమైన పాత్రలనూ సంఘటనలనూ సృష్టిస్తాడు.

పాఠకులను  తన ఆలోచనా ధోరణికి తీసుకురాగలిగిన నిర్మాణ శైలి వున్నందువల్ల వాళ్ళు అతని కధలను ఆస్వాదిస్తారు.

విషాద మిళితమైన ఒక నిస్సహాయ వాతావరణం ఇతని కధల్లో కనబడు తుంది. రాజకీయ చరిత్ర ఎప్పుడూ దోపిడీల,ఆధిపత్యాల చరిత్రే. దోపిడీ  శక్తులు రూపం మార్చుకుంటాయి తప్ప , దోపిడీకి కాని పీడనానికి కాని ముగింపు ఉండదు. పీడించేవాళ్ళు పీడనకి లోనయే వాళ్ళు ఎల్ల కాలంలోనూ ఉంటారు.వాళ్ళ చేతులనుంచి విముక్తి పొందామని అనుకుంటే అది కేవలం తాత్కాలికమే—ఇది ఈ కధకుడు ఆలోచనా ధోరణి . కొన్ని చోట్ల ఈ కధకుడు కధకుని పరిమితి దాటాడేమో నని కూడా అనిపిస్తుంది.

M_mukundanసమాజంలో నెలకొన్న మూల్యాలనూ సదాచార వ్యవస్థలను ప్రశ్నించిన రచయిత ముకుందన్. మత్తుమందుల పొగ నిండిన ఒక వాతావరణం ఇతని కధల్లో చూడవచ్చు. హరిద్వార్ కి వెళ్ళేట ప్పుడు కూడా మూడు పైపులు ఒక పెట్టె పొగాకు పెట్టెలో ఉంచుకోవడానికి మరవని పాత్రలు ఇతని కధల్లో సాధారణం .  బ్యాంగ్ తాగి ‘’పరిశుద్దులైన’’ వాళ్ళు వేశ్యలకు గుడి కట్టేవాళ్ళు కూడా కనబడుతారు ఇతని కధల్లో  –వీటి ద్వారా మూల్యాలను తిరస్కరిస్తునాడు కాని సమాజాన్ని విమర్శించటం లేదు కధకుడు. ఇతని కధల్లో ప్రేమ ఉండదు ;లైంగికత్వమే ఉంటుంది. తను అనుభవించినవి కావు ,తెలుసుకున్నవి ఇతడు కధల్లో ప్రస్తావిస్తునట్లు అనిపిస్తుంది.

ఇలాంటి రచయితుల కధలతో పోలిస్తే చాలా భిన్నంగా వుంటుంది సేతు కధా ప్రపంచం[జననం 1942]మధురమైన జీవితనుబంధాలు కానీ హృద్యమైన  జీవితానుభవాలు కానీ అతని చైతన్యానికి స్పందన అందించటం లేదు. కాల్పనిక సౌందర్యానికి అసలే ఆ కధా ప్రపంచంలో చోటు లేదు. బాహ్య జీవితం ఇతని రచనల్లో అడుగు పెట్టదు –అంతగా అడుగు పెట్టినా అవి ఫాంటసిగా మారుతాయి

జీవిత మహా ప్రవాహాన్ని ఉత్సుకతతో వీక్షించే వాడు కాదు సేతు. అతన్ని అస్వస్థత కు గురి చేసేది మనిషి అనే స్థితి  –దానివల్ల ఏర్పడే దురంత పూరిత పరిణామాలు . అరవై ఎనభై సంవత్సరాలకాలంలో అనావృతమయే ఒక దురంతాన్ని కొన్ని నిమిషాల్లో లేకపోతే ,కొన్ని గంటల్లో చూపించవలసి వచ్చినప్పుడు వాస్తవికత యొక్క మార్గం స్వీకరించటం కుదరదు. అలాంటప్పుడు ఫాంటసియోక్క మార్గం లోకి దారి మళ్లుతున్నాడు  ఇతడు. సేతు కధల్లోని మనుషులు పీడితలు –వివిధ బంధాల సంకేళ్ళల్లో ఇరుకున్నవాళ్ళు. ఇవి తప్పించుకోలేని స్ధితి అని, దానికి కారణం ప్రాకృతికం [నేచురల్ ]అని రచయిత నమ్ముతున్నాడు. జనన మరణాలు కలువలని మరణం బతుకుని మింగడానికి సమయం చూస్తూ వెంటాడుతుందని రచయిత భావం.  తప్పించుకోలేని ఏదో నియోగానికి తలవంచి నిర్ణయింపబడిన ఒక భ్రమణ పధంలో విఫలంగా తిరిగి తన దూరాంతాలను చేరడమే మానవావస్థ  అనే ఆలోచన రచయితను విడిచి పెట్టదు. ఆతని ఎక్కువ కధల్లో మరణం ఒక ముఖ్య పాత్ర. మరణాన్ని వివిధ కోణాల్లోనుంచి వీక్షిస్తాడు సేతు.

సక్కరియ గారి[జననం 1945] కధలు ఒక విచిత్ర ప్రపంచం.  మానవ మనస్తత్వాల సంక్లిష్ట భావాలను ఆవిష్కరించే కధలే కాక నేటి మానవుని ఆత్మస్తుతినీ కపట మనస్తత్వాన్ని హాస్య ధోరణితో నిశితంగా విమర్శించే కధలు కూడా వ్రాశాడు ఇతడు. మాటల్లో గొప్ప ఆదర్శాలు ఒలకపోసినా ,ని జ జీవితంలో అసలు వాటిని పట్టించుకోని క్రైస్తవ సమాజాన్ని చూసి నవ్వుతాడు ఈ రచయిత. మనో సంఘర్షణలను కాని మానసిక భావాలను కాని వ్యక్తపరిచేటప్పుడు ఆచి తూచి మాటలు వాడే సక్కరియ ,ఆక్షేప హాస్యం వ్రాసినప్పుడు మాటలు కుమ్మరిస్తాడు .

కొత్తదీ సంక్లిష్టమూ వైన ఆఖ్యాన శైలి వెతికి కనిబెట్టి ప్రయోగించిన కధా రచయిత మేథిల్ రాధా కృష్ణన్. ఇతని కధలు నిడివిలో చాలా పెద్దవి –శిధిలమైన సంఘటనా వివరాలు –కధా రూపంగురించి ప్రయోగాలు చేసిన ఇతడు ప్రత్యేకమైన టెక్నిక్ ద్వారా అతి సాధారణమైన సంఘటనకి అపరిచితత్వం ప్రసాదించి   భిన్నమైన ఒక వాతావరణం సృష్టించడానికి  ప్రయత్నిస్తున్నాడు. సృజన యొక్క  అందం కాదు రచనా నైపుణ్యమే ఈ కధల అస్తిత్వానికి కారణం.

ఆధునిక  కధా వికాసం గురించి సంక్షిప్తంగా ప్రస్తావించినప్పుడు కొందరు ప్రశస్త రచయితల పేరులు ప్రస్తావించక పోయివుండవచ్చు. శైలిపరంగా గాని దృక్కోణ పరంగా గాని మరే విధంగా గాని భిన్నమైన రచయితలు గురించే ప్రస్తావించటం జరిగింది –అంటే ఇక్కడ ప్రస్తావించబడని  ఎందరో, మలయాళ కధకి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అస్తిత్వ దర్శనం ఆధునిక కధకులను ప్రభావితం చేసింది కాని , ఆ ప్రభావం ఒకొక్క రచయితలోనూ ఒకొక మోతాదులో ఉంటుంది . కొందరు తొలి రోజుల్లో అస్తిత్వ వ్యధలను ఆవిష్కరించారు కాని తరువాత జీవితానుభవాల్లోకి తిరిగి వెళ్ళిపోయారు . 1980 నాటికి, 1960లో వ్యక్తమైన ఆధునికత యొక్క ప్రసక్తి  కోల్పోయింది మలయాళ కధ .

1980 తరువాత రచన ప్రారంభించిన కధకులు మూల్యాల అకారణ తిరస్కారాన్ని హర్షించలేదు. ఆధునికులు బోధ పూర్వంగా నిర్లక్ష్యం చేసిన సామాజిక స్పృహ ప్రదర్శించారు వాళ్ళు. నాగరీక జీవిత పరిస్థితుల్లో అనుబంధాలకు, మూల్యాలకూ వ్యక్తిత్వాలకు జరిగే పరిణామాల వైపు  సంఘర్షణా త్మకమైన జీవితపు సందర్భాల వైపు  మళ్ళీ తన ఆసక్తిని మళ్ళించింది మలయాళ కధ. కధ పూర్తిగా యుక్తి సహజంగా ఉంటాలని కాని నమ్మశక్యంగా ఉంటాలని కాని ఈ రచయితలూ అనుకోవటం లేదు. పూర్తిగా వాస్తవికమైనవీ ,కాల్పనికమైనవీ భావాత్మకమైన  కధలు కూడా ఈ కాలం కధకులు వ్రాస్తున్నారు .ఇతర ప్రాంతీయ భాషల్లో లా  స్త్రీవాద రచయిత్రులు కూడా తమ సాన్నిధ్యాన్ని తెలియపరిచారు ఈ కాలంలో.

lalithambikaనంబుద్రి కుటుంబాల అంతపురాల్లో మొగ్గే స్త్రీల గురించి యాబైల్లో వచ్చిన అంతర్జనం కధలతో –లేకపోతే దానికన్నా ముందే స్త్రీవాద రచనలు వెలుబడినా స్త్రీవాద రచయిత్రులు అనే ముద్ర పడిన రచయిత్రులు  కనబడేది ఈ కాలంలోనే. చంద్రమతి ,ఆషిత ,ప్రియ ఏ. ఎస్. , గీతా హిరణ్యన్,కే.ఆర్.మీర ,ఇందు మీనోన్ మొదలగు రచయిత్రులు వీళ్ళలో కొందరు. తను ఒక ఫెమినిస్టు కాదని గట్టిగా చెబుతూనే ఫెమినిజం  తాలూకు గొప్పతనాన్ని విమర్శించారు చంద్రమతి .  ఇతివృత్తాల్లోనూ  నిర్మాణంలోనూ వున్న వైవిధ్యం ఆమె మాటలను కొంత వరకు సమర్థిస్తుంది కూడా.  కాని ఆమె గొప్ప కధల్లో కొన్ని స్త్రీల సంకటాలను ఆవిష్కరించేవే. నేటి దాంపత్యం  తెలుసుకొని చేసే ఒక పరస్పర వంచన కదా అనే ప్రశ్నను ఒక గొప్ప కధలో ఆవిష్కరించారు ఆమె. స్త్రీల వ్యక్తి గత అనుభవాలను సరళంగా ఆవిష్కరించే ఆషిత [జననం 1956 ]టెక్నిక్ గురించి పెద్దగా పట్టించుకోరు.  తాళికి  ట్రాఫిక్ కానిస్టేబుల్  వేసుకున్న చొక్కాకి వున్న సురక్షితత్వం కూడా లేదని వ్రాస్తారు ఆమె ఒక కధలో.పురుషుని బాధ్యతా రాహిత్యం గురించి కూడా ఆమె అక్షర శిల్పాలు చెక్కారు. ఒంటరి స్త్రీలను గురించి వ్రాసారు ప్రియ .  జనాలమధ్య జబ్బువల్లనో పేదరికం వల్లనో స్నేహ రాహిత్యం వల్లనో ఒంటరిగా మారినవాళ్ళు ,జీవితంలో అమూల్యమైన ఏవేవో పోగొట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న ఇష్టాల తీగలు పట్టుకొని బ్రతుగు సాగిస్తున్నవారు  –ఇలాంటి పాత్రలు ఆమె కధల్లో చూడవచ్చు –దాంపత్య జీవితంలోని నమ్మక రాహిత్యం కూడా ఈమెకి కధా వస్తువే. స్త్రీల మనసులోని సంఘర్షణలూ ధర్మ సంకటాలు ఆవిష్కరిస్తున్నాయి గీతా హిరణ్యన్ కధలు.

గొప్ప రచనా శైలి గల రచయిత్రి కే. ఆర్.మీర[1970] పరిశుద్ధమైన జీవిత బంధాలను గౌరవిస్తున్నారు ఈ రచయిత్రి –సమాజంలోని సదాచార నియమాలను సవాల్ చేస్తున్నాను  అనే భావం ధ్వనించ కుండానే  మానవ సహజమైన ఒక వాస్తవికత అనే రీతిలో సమీక్షిస్తున్నారు  ఆమె లైంగికతను.  కొన్ని కధల్లో ఫెమినిజం  తాలూకు కొన్ని పోకడలను నిశితంగా విమర్శిస్తున్నారు కూడా.  ఈమె కధ లు కూడా  కొన్ని తెలుగులో లభ్యం .

చివరికి ఒక మాట చెప్పాలి. పేజీ కధలు ,  కాలమ్ దాటని కధలు ,కార్డు కధలు మొదలైనవి  మలయాళం లో ప్రాచుర్యం పొందని కధా రూపాలు. ప్రఖ్యాత కధా రచయితలు కొందరు [కమలా దాస్ ,టి. పద్మనాభన్ మొదలగువారు ] పేజీ కధలు వ్రాసి ఉన్నారు. కాని వాటి సంఖ్య చాలా తక్కువ. 2000 సంవత్సరం తరువాత పి,కే. పారక్కడవ్ అనే రచయిత అయిదారు వాక్యాల్లో కధలు వ్రాస్తునాడు. సామాజిక ఐరనీ,రాజకీయ మోసాలు,  స్త్రీ పీడనం ,ప్రపంచీకరణ మొదలగు విషయాలగురించి చాలా ‘ క్రిస్ప్” గా  వ్రాస్తాడు అతడు. కొన్ని కధలు ప్రతీకాత్మకంగా ఉంటాయి. పాఠకుడి పెదవి పై ఒక చిరునవ్వు విరియించి కధలు ఇలా కూడా గొప్పగా వ్రాయవచ్చా అని అనిపించేలా చేస్తాయి ఇతని కధలు. ఉదాహరణకి ఒకటి :

అడుగుల సవ్వడి :

 

తరువాత ఒక గర్జనం లాంటి కాలింగ్ బెల్ మ్రోత

తలుపు సగం తెరిచి చూశాను —అతడే !

కాగితం నాకు అందిస్తూ అతడు అన్నాడు

‘’మీరు పీల్చిన గాలి తాలూకు బిల్ ‘’

 

చివరికి సంక్షిప్తంగా చెప్పాలంటే మలయాళ కధకి సంబంధించిన వరకు మూడు పరిణామాలు జరిగాయి అని చెప్పాలి. వాస్తవిక సామాజిక జీవితంనుంచి వ్యక్తి తాలూకు సొంత దు:ఖాలవైపు మారటం మొదటి పరిణామం. కధ అంతర్ముఖం కావటమే కాక ఆర్ద్రత సంతరించుకుంది ఈ కాలంలో.  మానవావస్థనూ జీవితాన్నీ తాత్విక విమర్శతో వీక్షించేది విశ్లేషించేది  రెండో పరిమాణం. ఈ తాత్విక బరువు వదిలేసి కచ్చితమైన వాస్తవిక దృక్కోణంతో జీవితానుభవాలనూ  అనుబంధాలనూ విశ్లేషించి సర్గాత్మక సాఫల్యం పొందుతునారు నేటి కధకులు.

సమకాలీన మలయాళ కధల్లో ఆధునికానంతర సాహిత్య ధోరణీలు కనబడుతున్నాయా ?ఫెమినిజం  దళిత అవగాహన,  ఇతర సంస్కృతుల దాడి గురించిన అవగాహన ,ఆ దాడిని ఎదురుకోవాలనే ఆతృత వగైరాలు ఆధునికానంతర సాహిత్యపు లక్షణాలని అనుకుంటే అలాంటి ధోరణి మలయాళ కధల్లో కూడా కనబడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా అతి శక్తి వంతంగా కనబడేది ఫెమినిజం  .ఎందరో ఫెమినిస్ట్ రచయిత్రులు పురుషాధిక్యత గురించి స్త్రీ లైంగికత గురించి నేటి కట్టుబాటులకు సదాచార ఆలోచనలకు వ్యతిరేకంగా వ్రాస్తున్నారు . జీవితమే తమ సిరాబుడ్డి అని అంటునారు. ఒకొక్కప్పుడు  ఈ కధలు వాస్తవికతకి భిన్నంగానూ దూరంగానూ కనబడుతున్నాయి. ఇప్పడు నెలకొన్నవాటిని తిరస్కరిస్తునారు కాని వాటికన్నా ప్రయోజనకరమైనవాటిగురించి  ఫలదాయకమైనవాటి  గురించి ఆలోచించలేకపోతునారు వాళ్ళు .

దళిత స్పృహ కధల్లో అంత శక్తివంతం కాదు . టి. కే. సి.వాడుతల తోనూ అంతకన్నా ముందూ మొదలైన ఈ ప్రక్రియ వేరు తన్నలేదు. బహుశా కేరళ లో వున్న సామాజిక స్థితి గతులు కావచ్చు దానికి కారణం –రచనలను వర్గీకరించి చూసేదానికన్నా సమగ్రంగానే వీక్షిస్తునారు రచయితలూ ,పాఠకులు.

ఆదివాసీ జీవితంగురించి ఆదివాసిఅయిన  నారాయణ్  వ్రాసిన కధలు,  నవలలు నేటి సాహిత్యంలో ముఖ్యమనే చెప్పాలి. అయినా నేటి మలయాళ కధ కొంతవరకు ఇతివృతపరంగానూ పాత్రలపరంగానూ కేరళ సరిహద్దులు దాటిందనే ది వాస్తవం –మలయాళీల క్రియారంగం విశ్వ వ్యాప్తమైనప్పుడు కధ,కధా పాత్రలు కూడా విస్తరించటం సహజమే కదా !

 

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

–ఎల్. ఆర్. స్వామి

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)