ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా…

Missamma

ఒకప్పటి సినిమాల్లో పాటలుండేవి. అంతే కాదు పాటకు సినిమా కథకి సినిమా మొత్తం నిర్మాణానికి ఒక అంగాంగి సంబంధం ఉండేది. సినిమా మొత్తాన్ని ఒక కావ్యంగా అంటే సుష్ఠు నిర్మితితో చేయాలని పాటల్ని దానిలో విడతీయలేని భాగం చేయాలనే తపన ఒకటి కూడా ఉండేది. తెలుగు సినిమాహాళ్ళల్లో పొగరాయుళ్ళు సినీమాలో పాట మొదలు కాగానే బయటికి పోయి ఆవురావురు మంటూ ఒక సిగరెట్ లాగించేసి తిరిగి పాట అయి పోయే సరికే లోనికి వస్తూ ఉండేవారు. ఇక్కడ తాత్పర్యం ఆ పాట వినకపోయినా చూడక పోయినా సినిమా అర్థం కాని పరిస్థితి కాని వచ్చే లోపం ఏమీ లేదని.

కాని ఒకప్పటి సినిమాల్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు. సినిమాలో పాటకు సినిమా కథకు కథ నడిచే పద్ధతికి అంత విడదీయరాని సంబంధం ఉండేది. పందొమ్మిది వందలో ఏభై దశకంలో వచ్చిన సినిమాల్లో చాలా వాటిల్లో చందమామ పాటలు ఉండేవి. అంటే చందమామా అని వంత వచ్చే జానపద గీతాల గురించి కాదు చెప్పేది. ప్రణయ సందర్భంలో కాని విషాద సందర్భంలోగాని ఇంకో సందర్భంలో కాని నాయికా నాయకులు ఇతరులు కూడా చందమామని పాటలో పెట్టి లేదా అతన్ని ఉద్దేశించి పాటలు పాడేవారు. మనకి 1931లో మాట్లాడే సినిమా మొదటిది భక్త ప్రహ్లాద రాగా 1937 దాకా పౌరాణిక సినిమాలే వచ్చాయి. మొదటి సాంఘిక సినిమాగా మాలపిల్ల వచ్చింది అదే సంవత్సరంలో వచ్చింది దేవత సినిమా. ఇక అక్కడనుండి సాంఘిక సినిమాలు రావడం ఎక్కువైంది. ఈ సాంఘిక సినిమాల్లో పైన చెప్పినట్లుగా చందమామను తలచుకునే పాటలుండేవి. వీటిలో అద్భుతమైన సాహిత్యం ఉండేది. తొలినాటి నుండి ఇటీవలి సినిమాల దాకా చందమామ పాటలు చాలా వచ్చాయి. వాటిలో మంచి వాటిని తీసుకొని ఇక్కడ వివరించి చెప్పాలనే ఉద్దేశం ఈ వరుస వ్యాసాలు రాస్తున్నాను.

మిస్సమ్మ సినిమా 1955 లో వచ్చింది. అంటే ఇప్పటికి దాదాపు అరవై సంవత్సరాలు అయింది. కాని తెలుగు వారు ఈ తియ్యటి సినిమాని మర్చిపోలేదు. ఇప్పటికీ ఏ ఛానల్లో వచ్చినా దాన్ని నూరు శాతం ఆనందిస్తున్నారు. ఇందులోని ప్రతిపాట ఒక ఆనంద రసగుళిక. ఇందులో రెండు చందమామ పాటలున్నాయి. వీటినే నేను వెన్నెల పాటలు అని అంటాను. మిస్సమ్మలో లీల పాడిన రావోయి చందమామ మా వింత గాథ వినుమా అనే పాట ఇప్పటికీ ఎంత బహుళ వ్యాప్తంగా అందరికీ  ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పవలసిన పనిలేదు. దానికన్నా నాకు నచ్చిన వెన్నెల పాట ఇంకొకటి ఉంది. దాన్ని కింద ఇస్తున్నాను. చదవండి వినండి తర్వాత దీన్ని చదివితే  మీ ఆనందం మిన్నుముట్టుతుంది.

 

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

వినుటయె కాని వెన్నెల మహిమలు

వినుటయె కాని వెన్నెల మహిమలు

అనుభవించి నేనెరుగనయా

అనుభవించి నేనెరుగనయా

నీలో వెలసిన కళలు కాంతులు

నీలో వెలసిన కళలు కాంతులు

లీలగ ఇపుడే కనిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

 

కనుల కలికమిడి నీకిరణములే

కనుల కలికమిడి నీకిరణములే

మనసును వెన్నగ చేసెనయా

మనసును వెన్నగ చేసెనయా

చెలిమికోరుతూ ఏవో పిలుపులు

నాలో నాకే వినిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

ఈ పాట వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.raaga.com/player4/?id=2159&mode=100&rand=0.2477618893608451

 

ఈ పాట మాధుర్యం వింటే బాగా తెలుస్తుంది. అంతే కాదు సినిమా చూస్తే ఈ పాటలోని గొప్పతనం తియ్యదనం ఏమిటో తెలుస్తుంది. ఇందులో నాయకుడు ఎన్టీఆర్, నాయిక సావిత్రి ఇద్దరూ 1950ల్లో బి.ఎ పాసయ్యారు. ఆనాటికి బి.ఎ పాసు కావడమంటే నేడు పి.హెచ్.డి చేసిన వారికున్నంత స్థాయితో లెక్కవేసేవారు. అయితే ఉద్యోగానికి వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లో స్కూలు పంతులు గార్ల ఉద్యోగాలు పడ్డాయి. అందులో మెలికేమిటంటే ఒక ఆడ బి.ఎ ఒక మగ బి.ఎ కావాలని ఇద్దరూ భార్యాభర్తలు అయి ఉండాలని ప్రకటనలో ఉంది. సావిత్రి ఎన్టీఆర్ ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసిగి పోయారు. దీన్ని చూచి పెళ్ళికాని వాళ్ళిద్దరూ మాకు పెళ్ళి అయిందని అబద్ధం ఆడి, రాసి ఉద్యోగంలో చేరారు. కథలో గమ్మత్తు ఏమిటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. పరిచయం అయిన రెండు మూడు రోజులకే ఈ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అతను హిందూ, ఇద్దరికీ పెళ్ళి కావడం అప్పటి పరిస్థితిలో సాధ్యం  అయ్యే పని కాదు. రెండు నెలలు పని చేసి గొంతు మీద ఉన్న బాకీ తీర్చుకొని పోదామని ఆమె చేరింది.

aVy3KQJ9_592

అబద్ధాలతో బతుకుతుంటారు. భార్యాభర్తలు గా నటించడానికి చాలా కష్టపడుతుంటారు. బయటివాళ్ళు వరుస పెట్టి పిలిస్తే ఆమెకు నచ్చదు. ఒకే ఇంటిలో ఇద్దరు వేరు వేరు గదుల్లో ఉంటారు. ఎవరి వంట వారే చేసుకుంటారు. వీరి రహస్యం వీళ్ళ నౌకరు దేవయ్యకే తెలుసు. వాళ్ళు పనిచేసే బడి యజమాని జమీందారు ఆయన భార్య వీరిద్దరినీ తమ కూతురు అల్లుడూ లాగా చూసుకుంటారు. అలాగే పిలుస్తుంటారు. అలా వరుసలు పెట్టి పిలవడం ఆమెకు ఇష్టం ఉండదు. జమిందారు కూతురు, జమున ఎన్టీఆర్ కి దగ్గర కావడం కూడా సావిత్రికి నచ్చదు. ఆమెకు ఎన్టీఆర్ పైన తనకే తెలియని ప్రేమ కలుగుతున్న కొద్దీ జమిందారు కూతురు జమున పైన అసూయ నానాటికి పెరుగుతుంటుంది. క్రమంగా ఎన్టీఆర్ (రాజారామ్ నాయుడు)ని గాఢంగా ప్రేమిస్తుంది. ఆ విషయాన్ని ఆమె కూడా సరిగ్గా గమనించదు. కాని ప్రవర్తనలో అది అడుగడుగునా అసూయ రూపంలో బయట పడుతుంది. ఈ అసూయతో ఎన్టీ ఆర్ పైన జమునపైన విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంది.

ఈనాటి సినిమాల్లో ఐ లవ్ యూ చెప్పడం ఒక తప్పని సరి ఫార్ములాగా నిలిచింది. ఎన్నో సార్లు ఎంత మంది సమక్షంలోనో చెప్పాలి. ప్రేమ కోసం యుద్ధాలు చేయడాలు వగైరా ఫార్ములాల గురించి ఇక్కడ చెప్పవలసిన పని లేదు. కాని ఇక్కడ సావిత్రి పాత్రను తీర్చిదిద్దిన తీరు గురించి బాగా చెప్పాలి. ఒక కావ్యంలోనో నవలలోనో నాయిక పాత్రను ఒక మంచి నిపుణుడైన కవి ఎలా తీర్చి దిద్దుతాడో సినిమాలో ఈ పాత్రలను అలా తీర్చాడు దర్శకుడు ఎల్వీ ప్రసాద్. నాయిక సావిత్రి ఎన్టీఆర్ ని అంత గాఢంగా ప్రేమించినా అది ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దడంలో సహజమైన ఒక పద్ధతిలో చూపుతాడు ఒక మానసిక స్థితిని ఒక నవలలో అద్భుతంగా వర్ణించిన పద్ధతిలో ఆ పాత్ర ప్రవర్తనని చూపుతాడు. కాని ఎక్కడా సావిత్రి నాయకుడిని ప్రేమిస్తున్నానని చెప్పదు. ప్రవర్తనలో కనిపిస్తుంది అదీ వ్యతిరేక రూపంలో. ఇలా సాగే క్రమంలో నాయికతో ఎలా గైనా కాలం గడపాలని కడుపుకోసం నానా కష్టాల పడుతుంటాడు ఎన్టీఆర్. ఈ కష్టం చివరి దశకు వచ్చింది. సావిత్రి గర్భవతిగా పొరపాటు పడి ఆమెకు సీమంతం చేస్తారు జమీందారు దంపతులు వాళ్ళింట్లోనే. అప్పటికే చాలా అసూయని ఆగ్రహాన్ని ఎన్టీఆర్ పైన చూపిస్తూ ఆయన చేస్తున్న తప్పులను తిడుతూ వచ్చిన సావిత్రికి తను అతనిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటూనే ఉంటున్నా అదే కొనసాగిస్తుంది. సీమంతం చేసిన తర్వాత ఆరాత్రి అక్కడే నిద్రపోవాలని వాళ్ళిద్దరినీ ఒక గదిలోనికి పంపిస్తారు. ముందుగా గదిలో ఉన్న నాయకుడు తర్వాత సావిత్రి లోనికి వచ్చి ఇదంతా అతని కుట్ర అని తనను ఇలా మోసం చేయడానీకే ఇదంతా చేస్తున్నారని తిడుతుందని నాయకుడు తెరచాటున దాక్కుంటాడు. తర్వాత సావిత్రి లోనికి వచ్చిన తర్వాత ఆమెను భయపెట్టి కిటికీలోనుండి బయటికి దూకి ఇంటికి పోతాడు ఆమెను ఇబ్బందికి గురిచేయడం ఇష్టం లేక.

images

సావిత్రి ఇంట్లో వాళ్ళని పిలిచి తనను తన ఇంటికి పంపించమంటుంది. ఆమె అలా ఇంటికి పోయేసరికే కిటికీ లోనుండి దూకి కాలు విరగ కొట్టుకొని (నాటకం) మంచంలో దీనంగా పడి ఉన్న నాయకుడు కనిపిస్తాడు. ఆమెకు అతనిపైని ప్రేమ అతని పట్ల సానుభూతి ఒక్కసారిగా పొంగాయి. అతన్ని మోసుకొని పోయి లోపలున్న తనుపడుకునే పందిరిమంచం మీద పడుకో బెడుతుంది. కాలి బాధతో నిద్రపోలేనంటాడు. తనకు తెలియకుండానే తనలో ఆతని పట్ల ఎంతో గాఢమైన ప్రేమ ఉందని ఆమె తెలుసుకుంటుంది. అతన్ని నిద్రపుచ్చడానికి పాట అందుకుంటుంది. ఇంత కథా సందర్భాన్ని గర్భీకరించుకొని వచ్చిన పాట పైన చెప్పిన వెన్నెల పాట. తన ప్రవృత్తిని తన మనఃస్థితిని ఈ పాటలో కవి వెల్లడిస్తాడు. సినిమా మొత్తానికి కథని మాటలని అందించిన కవి ఒక్కడే కావడం వల్ల కథా సందర్భాన్ని తెలుసుకొని దానికి ఇమిడేలా పాటనురాసాడు పింగళి నాగేంద్రరావు.

ఇప్పడు పాటని చూస్తే విషయం మనకు తెలుస్తుంది. తనలో కలిగిన ప్రేమను ఆ స్థితిని ఏమిటో ఈ మాయ అని అనుకుంటుంది గదిలోనుండి బయటికి వచ్చి బల్లమీద కూర్చుని నింగిలోని చందమామ వైపు చూస్తూ పాడుతుంది సావిత్రి ఈ పాటని. ముఖంమీద వెన్నెల పడే తీరును కెమేరా కళతో చిత్రించిన తీరు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయ అని చందమామతో చెప్పుకుంటుంది. ఈ స్థాయిలో కూడా నాయిక తన ప్రేమని నాయకుడి ఎదురుగా కూర్చుని చెప్పదు. కుస్తీపట్లుపట్టే లా ఉండే కొరియోగ్రఫీతో నాయికా నాయకులు ఒకరిమీద ఒకరు యుద్ధం చేస్తూ ఉండేలా ఉండే నేటి రోమాంటిక్ డ్యుయెట్లని తలచుకొని ఆ పాటల్ని చూస్తే ప్రేమని ఎంత సున్నితంగా నిజమైన శృంగరంగా చిత్రించారో తెలుస్తుంది.  వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా. అంటుంది. వెన్నెల మహిమ తనపైన ఎలాఉందో అర్థం అయింది. ఇక్కడ వెన్నెల తనలోని ప్రేమకి ప్రతీక చందమామ శైతల్యం ఇక్కడ ప్రణయానికి చిహ్నం. నాయికా నాయకులు కలిసి ఉన్నప్పుడు చందమామ చల్లని రాజు, అదే విరహంలో చందమామ చల్లని వెన్నెలే నాయికకు వేడి మంటలుగా తోస్తుంది. విప్రలంభ శృంగారంలో, విరహంలో  చంద్రుడిని తిట్టడం అప్పటి కావ్యాల నుండి ఇప్పటి దాకా వస్తూనే ఉంది. వెన్నెల మండెడిదీ అని ఒక పాటలో అన్నమయ్య కూడా రాసాడు. వెన్నెల మహిమ ఎలా ఉంటుందో ప్రణయంలో అది ఎంత చల్లాగ ఉంటుందో తనకు ఇప్పటి దాకా తెలియదని చెబుతూ తనకు నీపై ప్రేమ కలిగిందని నాయకుడికి నర్మగర్భంగా చెబుతుంది ఇక్కడి నాయిక సావిత్రి.

13909646434184550535-1

కనుల కలికమిడి నీకిరణములే మనసును వెన్నగ చేసెనయా అని అంటుంది. కనులకలికమిడి అని చెప్పడం అద్భుతమైన తెలుగు పలుకుబడి. తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. మొదట భగ్గున మండుతుంది. తర్వాత అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని పోగొడుతుంది. ఇక్కడ చందమామ కిరణాలే కంట్లో కలికం పెట్టినట్లుగా చేసి మనసును వెన్నెగ చేసాయట. ఇది కవి చేసిన అద్భుతమైన ఊహ. ఆమె మనస్సు వెన్నలా కరిగి ప్రియుడిపైన ప్రేమను వర్షించే స్థితికి చేరిందని చెబుతుంది ఆమె. ఇక చివరిగా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా అని అంటుంది. ఏమిటో  ఈ మాయ అని చివరిగా పాటని ముగిస్తుంది. తనలో అతనిపైని ప్రేమని పూర్తిగా తెలుసుకున్నానని నాయకుడికి చెప్పే తీరుని వర్ణించిన ఈ పాట ఒక మంచి శృంగార రసగుళిక. వెన్నెలని ప్రేమకి ప్రతీకగా చెప్పిన తీరు చాలా బాగుంది.

పింగళి నాగేంద్ర రావు రాసిన ఈ పాటకి సాలూరు రాజేశ్వరరావు కూర్చిన సంగీతం మరింత మాధుర్యాన్ని తెచ్చింది. అంతే కాదు సినీమా ఈ ఘట్టానికి వచ్చే సరికే ఈ పాటని చూసిన ప్రేక్షకులకి మనస్సంతా ఆనందం ప్రేమ నిండిపోతాయి. ప్రేక్షకులు పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. సింధుభైరవి రాగంలో వచ్చిన ఈ పాట మనస్సుకు హత్తుకునే తీరులో ఉంటుంది. ఈ రాగానికి కూడా ప్రణయాన్ని పలికించే గుణం ఉంటుంది.

ఇలాంటి అద్భుతమైన వెన్నెల పాటలు తెలుగు సినిమాల్లో ఆనాటి వాటిల్లో చాలా ఉన్నాయి. వరుసగా వాటి సాహిత్య ఔన్నత్యాన్ని పరిచయం చేస్తాను.

పులికొండ సుబ్బాచారి

subbanna

 

 

 

Download PDF

4 Comments

  • aparna says:

    chaalaa baavundi!

  • kv says:

    చాలా బాగుంది. ఐతే కథ తగ్గిస్తే బాగుండేది.

  • csrambabu says:

    ఈ పాట విన్నప్పుడల్లా ఒక రసానుభూతి కలుగుతుంది…మాటలకందని అనుభూతిని మీరు పంచిపెట్టారు ..ధన్యుడిని..

  • sampath kumar M says:

    చాలా బాగుంది సుబ్బ మామా
    సంపత్ కుమార్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)