ప్రతి రచయిత మదిలో మెదిలే మాస్టారు

చేరాగారితో 80-90 ల నాటి ఏ కవికైనా అనుబంధం లేకుండా ఉందా?  రచయితలెవరికైనా చేరా జ్ఞాపకాలు లేకుండా ఉంటాయా?
1991 లో కవులందర్నీ మొదటి సారి కలుసుకున్న సభలోనే “చేరా” ” “కె.గీత” అంటే డిగ్రీ చదువుతున్నంత చిన్నమ్మాయి అని అనుకోలేదు” అని ఆశ్చర్యపోవడం,  తర్వాతి సంవత్సరం  “నీ కవిత్వ సమీక్ష చూసుకున్నావా?” అని  నవ్వుతూ గద్దించి అడగడం… తొలి నాళ్ల జ్ఞాపకాలు.

తర్వాత ఎప్పుడు ఎక్కడ కనిపించినా కవిత్వం పట్ల ఉన్న ఆత్మీయ స్వరం కవికి కూడా బహూకరించిన మంచి మనీషి చేరా. “ద్రవభాష” కవిత్వ ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని పుచ్చుకుని ఇంటికి వెళ్తే “అయ్యో, ఇంటిదాకా రావాలా, గీత కవిత్వం అంటే రెక్కలు కట్టుకుని రానూ…” అని చమత్కరించడం…., భాషా శాస్త్రం లో పీ.హెచ్.డీ చేస్తున్న రోజుల్లో తమ ఇంట్లో పెద్ద చెక్క పెట్టె నిండా ఉన్న పుస్తకాలతో తన అనుబంధాన్ని నాతో పంచుకున్న క్షణాలు…గంటల తరబడి నాతో భాషా శాస్త్రపు చర్చలు……”చాలా తమాషాగా మనిద్దరికీ ఒక సారూప్యత ఉంది చూసేవా, కవిత్వమూ, భాషా శాస్త్రమూ.. రెండు కళ్లు…నాకూ, నీకూ “….అని నవ్వడం…
ఒకటా, రెండా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు…..ఆయన దగ్గర చదువుకోకపోయినా నాకూ ఈ విధంగా చేరా “మాస్టారే”.
కన్నీళ్లు అక్షరాలను చెరిపి వేసే కాగితాలపై రాయకున్నా కీ బోర్డు మీద  తడి వేళ్లు అక్షరాలను మలిపి వేస్తున్న… దు:ఖం………

-కె.గీత

చేరా గారు లేరే అని ఎప్పుడూ అనిపిస్తుంది…!

చేరా గారిని నేను చూసింది, కలిసింది ఒక్కసారే. ఆ కలయిక ఒక జ్ఞాపకం.. అంతే. అయితే చేరా గారిని అనేక వందలు, వేల సార్లు కలుసుకున్నది చేరాతల ద్వారానే. ఆంధ్రజ్యోతిలో చేరక ముందు, చేరిన తర్వాతా.

చేరాతల ద్వారా నా యవ్వనకాలపు అనేక మంది యువ కవులను తెలుసుకోగలిగాను, కలుసుకోగలిగాను, కలబోసుకోగలిగాను. అఫ్సర్లు, యాకూబ్ లు, ఇంకా అనేక మంది… నాకు చేరాతల ద్వారానే తొలి పరిచయం. నేను కవిత్వానికి దూరమయ్యానేమో కానీ… ఈ కవులకు ఎప్పుడూ దూరం కాలేకపోయాను.. వారి భావ పరిణామక్రమం ఎలా వున్నా సరే. నా భావ పరిణామక్రమం ఎలా వున్నా సరే.. వారూ అంతే సన్నిహితంగా వుండిపోతూ వచ్చారు.

అలా.. ఒకరినొకరిని.. కవికి, పాఠకుడికి పీటముడి వేయగల అరుదైన సాహితీ క్రిటిక్ చేకూరి రామారావుగారు. యువకవులను చేరాగారు పరిచయం చేశారంటే… వారిక మన ఇంట్లో బంధువు అయిపోయినట్టే.

మా అమ్మగారి ఊరు వీరులపాడుతోనూ చేరా గారికి ప్రత్యేక అనుబంధం వుంది. ఆ విధంగా నాకూనూ.  వీరులపాడు.. ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దు గ్రామం, కృష్ణా జిల్లాలోది. చేరా గారి సోదరి మెట్టినిల్లు వీరులపాడు. అందువల్ల తరచూ వచ్చిపోతుండేవారు. వీరులపాడు వచ్చినప్పుడు… వారికి కాలక్షేపం అంతా, ఆ ఊరి గ్రంథాలయంలోనే. జీవిత చరమాంకంలోనూ ఆయన అదే పుస్తక పఠన వ్యాపకంలో వున్నారని పత్రికల్లో చదివాను.

అప్పట్లో… చేరా గారి మీద గుసగుసలు వినిపించేవి.. ముఖ్యంగా తోటి కవిలోకంలో. ఆయనెప్పుడూ ఆయనకు తెలిసిన, నమస్కారం కొట్టిన, మరీ ముఖ్యంగా ఖమ్మం కవుల గురించే రాస్తుంటారని. కాలక్రమంలో, నమ్మకంమీద నాకు తెలిసిన విషయం ఏమిటంటే… ఆయన అటువంటి పక్షపాతి కాదని. ఆయన పరిచయం చేయకపోయివుంటే… నాకు ఖమ్మం జిల్లాకు చెందిన వారివే కాదు… చాలా జిల్లాలకు చెందిన కవుల పేర్లు తెలిసేవి కాదు. ఆ రోజుల్లో వారిని చదివి వుండేవాడినీ కాదు.

కొద్ది నెలల క్రితం.. ఫేస్ బుక్ లోనే.. మెర్సీ సురేష్ జజ్జర గారి కొన్ని లైన్లు చూసి… అయ్యో.. మిమ్మల్ని లోకానికి పరిచయం చేయడానికి చేరా గారు లేరే అన్నాను. (చేరా గారు అప్పటికి జీవించే వున్నారు).

ఇంకా కరెక్టుగా చెప్పాలంటే.. చేరాతలు వస్తున్న కాలంలో మీరు కవిత్వం రాసి వుంటే ఎంత బావుండేది అనే భావంతో.

యువ కవులను ప్రోత్సహించి, మంచిచెడ్డలను విచారించి, వారిని ఓ ఉన్నత కవితా స్థాయికి తీసుకెళ్లడంలో చేరా గారు చేసిన కృషి… తెలుగు నేలపై ఇంకా గుబాళిస్తూనే వుంది.

ఆ రోజులు మళ్లీ రావు.

 

-వాసిరెడ్డి వేణుగోపాల్

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)