ఉత్తర అమెరికా తొలి తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

10614218_300362290152515_8326601315087796337_n
అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం)
ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకూ
హ్యూస్టన్, టెక్సస్
ఆత్మీయ ఆహ్వానం
మీ అందరి ప్రోత్సాహంతో, 1998లో ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా జరుగుతున్న ద్వైవార్షిక అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సుల సత్సాంప్రదాయాన్ని అనుసరిస్తూ, అంతకంటే ఆసక్తికరంగా 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహానగరంలో రాబోయే అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) తారీకులలో జరగబోతోంది. ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా, ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య ప్రారంభానికి అదే తొలి అడుగుగా గుర్తిస్తూ ఆ కథ అర్ధ శతాబ్ది ఉత్సవాలు ప్రధాన అంశంగా ఈ “తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా ఆహ్వానిత అతిథులుగా కెనడా నుంచి వస్తున్న ఉత్తర అమెరికా తొలి కథకులైన స్వర్గీయ శ్రీ మల్లికార్జున రావు గారి కుటుంబం, ఉత్తర అమెరికా తొలి కవి & పత్రికా సంస్థాపకులు స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి కుటుంబం (అట్లాంటా), అమెరికా లో తొలి కథకులైన చెరుకూరి రమాదేవి (డిట్రాయిట్), వేమూరి వెంకటేశ్వర రావు (ప్లెజంటన్, కాలిఫోర్నియా) లకీ, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యానికి పునాదులు వేసిన తదితర ప్రముఖులకి వారికి ఈ మహా సభలో ఆత్మీయ సత్కారం జరుగుతుంది.
గత యాభై సంవత్సరాలగా అమెరికాలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్యం 50వ వార్షికోత్సవ సందర్భంగా అమెరికా తెలుగు కథకి, కవితల ఆవిర్భావాలనీ నెమరువేసుకుని మరింత ఉజ్జ్వల భవిష్యత్తు కోసం పునాదులు బలిష్టం చేసుకునే ఆలోచనలు మనతో పంచుకునే సుప్రసిద్ధ అమెరికా సాహితీవేత్తలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ మహా సభలకు విచ్చేయనున్నారు. ఇటువంటి అపురూపమైన అవకాశం వచ్చినాపుడైనా మన సాహిత్య చరిత్రని మనమే గుర్తు చేసుకుని ఆ చరిత్ర సృష్టించిన వారిని గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే!
భారత దేశం నుండి కూడా కొందరు ఉత్తమ సాహితీవేత్తలని ఇక్కడికి ఆహ్వానించి అక్కడి సాహిత్య విశేషాలని తెలుసుకోవడం, మన సాహిత్య పురోగతిని మాతృదేశం లో మన వారికి తెలియజేసే మా సాంప్రదాయం ప్రకారం ఈ మహా సభలకు భారత దేశం నుండి ముఖ్య అతిథులుగా తొలి సారిగా హ్యూస్టన్ నగరానికి శ్రీ తనికెళ్ళ భరణి & శ్రీ రావి కొండల రావు రావు గారూ, తొలి సారిగా అమెరికా పర్యటనకు శ్రీమతి ముక్తేవి భారతి, శ్రీ తల్లావఘ్ఘుల పతంజలి శాస్త్రి గారూ ఆహానించబడ్డారు.

10628066_300362316819179_131675058726844698_n
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి వారి సాహితీ లోకం బృందం లాభాపేక్షలేని నిర్వహణలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సాహితీ సదస్సులో ఉత్తర అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న తెలుగు రచయితలు, పండితులు, విమర్శకులు, వక్తలు, భాషాభిమానులనూ, తెలుగు భాషా, సాహిత్యాలను అన్నిచోట్లా పెంపొందించదల్చుకున్న వారందరినీ పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

సదస్సు ప్రధానాశయాలు

ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య 50 వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో అమెరికా సాహిత్య విజయాలని నెమరు వేసుకుని, తోటి రచయితలను, సాహితీవేత్తలనూ, తెలుగు భాషా, సాహిత్యాభిమానులనూ వ్యక్తిగతంగా, ఆత్మీయ సాహిత్య వాతావరణంలో కలుసుకొని, సాహిత్య పరిచయాలను పెంచుకొనడం, ఈ సమావేశానికి వచ్చిన రచయితలందరికీ, తగిన స్థాయిలో తమ రచనలను, సాహిత్య పరమైన అభిప్రాయాలను సహ సాహితీ ప్రియులకి స్వయంగా వినిపించే అవకాశాలు కలిగించడం ఈ సదస్సు ముఖ్య ఆశయాలు.
ప్రత్యేక ఆకర్షణలు
స్వీయ రచనా పఠనం, నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయ శాల, చర్చా వేదికలు, సరదా సాహిత్య పోటీలు, “సాహిత్య “ప్ర-జ” ప్రత్యేక వేదిక” (సాహిత్యపరమైన ప్రశ్నలూ-జవాబులు), అందరూ అప్పటికప్పుడు పాల్గొనే గొలుసు కథ, మరెన్నో….

10647170_300362460152498_8223353005422413139_n
రచయితలకు, వక్తలకు విన్నపం
ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ప్రసంగించదల్చుకున్న వారు, స్వీయ రచనా విభాగంలో తమ రచనలను వినిపించదల్చుకున్నవారూ ఈ క్రింది నిర్వాహకులను సంప్రదింఛండి. ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాషాసాహిత్యాలకి సంబంధించినవే ఉండాలి. అమెరికాలో తెలుగు సాహిత్య పోకడల మీద ప్రసంగాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం.
పై ఊరి వారికి ప్రత్యేక సదుపాయాలు
ప్రతిష్టాత్మకమైన ఈ 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కు ఉత్తర అమెరికాలో ఇతర నగరాలనుంచీ వచ్చే సాహితీవేత్తలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, అతి తక్కువ ఖర్చుతో వసతి సదుపాయాలు, వాహన సదుపాయాలు చెయ్యబడ్డాయి. సముచితమైన ఏర్పాట్లు చేయడానికి వీలుగా ఈ అమెరికా తెలుగు సదస్సులో పాల్గొన దల్చుకున్నవారు ముందుగా నమోదు చేసుకోవాలి. నమోదు వివరాలు, ఇతర ఆసక్తికరమైన విషయాలు త్వరలోనే ప్రకటించబడతాయి.
రాబోయే అక్టోబర్ 25-26, 2014 తారీకులలో హ్యూస్టన్ లో జరిగే ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు వచ్చే ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవలసినదిగా అమెరికా రచయితలనూ, సాహితీవేత్తలనూ, భాషాభిమానులనూ కోరుతున్నాం. ఈ సదస్సుకు సంబంధించిన ఏ విషయం పైనా ఈ క్రింది ఔత్సాహిక నిర్వాహకులను సంప్రదించండి. అతిథులను గౌరవంగా ఆహ్వానించి మర్యాద చేయడమే మా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి మరియు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ప్రధాన లక్ష్యం.

Conveners:

Dr. Vanguri Chitten Raju
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com
&
Maruthi Reddy
Phone: 832-240-6749
E-mail: c_maruthi@hotmail.com

Coordinator:
Sai Rachakonda
Phone: 281 235 6641
E-mail: sairacha@gmail.com
Organizing Committe: C.N. Satyadev, Madhu Pemmaraaju, Satyabhama Pappu, Sarada Akunuri. Krishna Keerthi, Ram Cheruvu, Raghu Dhulipala, Ravi Ponnapalli, Lalitha Rachakonda, Sitaram Ayyagari, Pallavi Chilappagari, Sudhesh Pilliutla, Mallik Putcha.

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)