రోజు గోదావరి ఒడ్డున ఉన్న కోటి లింగాల రేవుకి ఉదయాన్నే వెళ్లి కాలు ఝాడిస్తూ ఉంటాను. గత పదిహేను ఏళ్ళ గా ఉన్న అలవాటు అది, చేసేది కాలేజీ లో అధ్యాపక వృత్తి, ఇంక నా ప్రవృత్తి అంటారా మనుషులని చదవడం, వాళ్ళ స్వభావాలను అంచనా వెయ్యడం తో పాటు అప్పుడప్పుడు చిన్న-చితక కధలు, కవితలు రాస్తూ ఉంటాను . అన్నీ మన చుట్టూ జరిగే సంఘటనలని చూసి రాస్తూ ఉంటాను. ఇది నా అర్ధభాగానికి అస్సలు నచ్చని సంగతి. “ఎవరిగురుంచో మీకు ఎందుకండీ ఇన్ని ఆలోచనలు” అని ఆవిడ నన్ను సాధిస్తూ ఉంటుంది. అయినా నా అలవాటు మారలేదు, మార్చుకోను లేదు. అందుకే పొద్దునే వస్తాను ఏకాంతంగా మనుషులని పరిశీలన చేస్తూనే ఉంటాను. దాంతోటి నాలోని రచయతకు పని కలిపిస్తాను. ఇది స్థూలంగా నా దినచర్య.
ఈ మధ్యనే ఒక ఆవిడను ఇంచుమించుగ ఒక నెల రోజుల నుంచి గమనిస్తున్నాను.పెద్ద వయస్సు గల ఆవిడలా లేదు. పచ్చగా, పెద్ద కుంకుమ బొట్టుతో నిండుగ కనిపించే రూపం. ముఖమంతా పరుచుకున్న చక్కటి నవ్వు చూస్తుంటే ఎవరో పెద్దింటి ఆవిడ లా వుంది అని అనుకున్నాను. ఆవిడ కూడా ఇంచుమించుగా రోజు పొద్దునే గోదారి గట్టుకు వస్తుంది. రావడమే ఎవరో తరుముతున్నట్లు గా భలే హడావుడి గా వస్తుంది. ఎప్పుడు వెళుతుందో మాత్రమూ అస్సలు తెలియటం లేదు .అసేలే నా బుర్ర కి ఇలాంటి వి చూస్తె కోతి కి కొబ్బరికాయ దొరికినట్లే ! ఈ మారు శ్రద్ధ పెట్టి చూడాలి అని అనుకుంటూ ఇంటికి బయల్దేరాను.
ఇల్లు ఇక్కడికి దగ్గరే సీతంపేటలో. మాది డాబా ఇల్లు, మా తాతగారి వారసత్వంగా వచ్చినది. ఏదో పెద్దవాళ్ల పుణ్యమా అని తలదాచుకునేందుకు ఓ సొంత గూడు అనేది వుంది. వస్తున్న జీతం తో ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతోంది జీవితం. అందుకు భగవంతుడికి సర్వదా కృతజ్ఞడుని.
అలానడుస్తూ వుండగా సన్నగా ఏడుపులు వినిపించాయి. పాపంఎవరో ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకొని ఇక తిరిగిరాని లోకాలికి వెళ్లి పోయిన ట్లున్నారు. గోదారి ఒడ్డునే ఉన్న స్మశానవాటిక దగ్గరకి తీసికొనివెళుతున్నారు. అలా నేను అటువైపు చూస్తూవుండగా తొందర తొందరగా రోజు నేను చూస్తున్న ఆవిడ ఆ శవం వెనకాలే వెడుతోంది. పాపం ఆవిడ బంధువులు కామోసు, వాళ్ళు అని నాకు నేనే చెప్పుకున్నాను.
యధాప్రకారం మరునాడు నేను వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే నా చూపులు ఆవిడ కోసం వెతికాయి. కాని ఆవిడ ఎక్కడా కనపడలేదు. రోజులాగే నా ఉదయ వాహ్యాళి పూర్తిచేసుకొని వెళ్ళిపోయాను. ఇలా ఓ వారం రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం కావటం తో నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. నేను వెళుతుండగానే ఆవిడ పరుగులాంటి నడక తో వస్తోంది. ఇంతలో చలపతి గారని మాకు బాగా తెలిసిన బ్రాహ్మణుడే, ఆయన మా ఇంటికి పూజలు చేయించడానికి వస్తారు, ఆయన ఈవిడని చూసి “ఏమ్మా ఇప్పుడా రావడం? నేను పొద్దున్నే రమ్మనిచెప్పాను కదా! వాళ్ళు అందరు మీ కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ప్రయాణం పొద్దునే అట, ఆలశ్యం అయిపోతోందని విసుక్కుంటున్నారు” అంటూ ఈయన కొంచెం గదమాయించి నట్లుగా అన్నాడు. దానికి సమాధానం గా పాపం ఆవిడ చిన్నపోయిన మొహంతో ఎంతో నొచ్చుకుంటూ ‘ఏమీ అనుకోకండి చలపతి గారు, మా మావగారికి ఒళ్ళు బాలేదు బాబు, అందుకే కొంచెము ఆలస్యమైంది’ అని అంటోంది .
“సరే సరే పదండి వాళ్ళు ఆ పక్కన మనకోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఆపక్కగ వున్న పావంచల వైపు గబ గబా తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఓ ఇద్దరు ఆడవాళ్ళూ, కొంతమంది మగవాళ్లు వున్నారు. వాళ్ళు ఆవిడని గట్టుమీద కూర్చోమన్నారు ఒకావిడ ముఖానికి పసుపు రాసింది ఇంకో ఆవిడ బొట్టుపెట్టింది మూసివున్న చేటలని ఆవిడకి అందించింది. అప్పుడు అక్కడే వున్న వేరే బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలూ చదివి “మీ అమ్మగారిని తలచుకొని నమస్కారం చెయ్యండి” అని వాళ్ళ ఇద్దరకి చెప్పాడు.
ఆవిడతో చలపతిగారు “సీతమ్మ! ఇక్కడ నీ పని అయింది. ఇహ! ఆ శంకరం గారి భార్యది వుంది అందుకే ఎక్కడకి వెళ్ళిపోక ఇక్కడే వుండు.! వాళ్ళు వచ్చాక ఆ నిన్ను సూరిపంతులు పిలుస్తాడు” అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
ఆవిడ “అలాగే చలపతి గారు”‘అని తల ఊపి తన కూడా తెచ్చుకున్న సంచిలో వాళ్ళు ఇచ్చిన వన్నీ సర్దుకుంటోంది. మధ్యలో తలయెత్తి ఇందాక వాయనం ఇచ్చిన ఆడవాళ్ళని వో సారి చూసింది. అంతవరకూ మాములుగా కబుర్లు చెప్పుకుంటూ వున్న వాళ్ళు గబగబా అక్కడనుంచి నడచుకుంటూ కొంచెం పక్కకు వెళ్లారు. అందులోఒకావిడ అంటోంది “చూసావా ఆవిడ వాలకం, ఆ చూపులు వట్టి ద్రిష్టి కళ్ళు, అవి మంచివి కాదు బాబు నరుడి కళ్ళకి నాపరాళ్ళుఅయిన పగులుతాయి అంటారు అందుకే ఇలాంటి వాళ్ళని శుభాలకి ఎవరూ పిలవరు” అంటూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు,
అంతవరకూ జరిగినదంతా చూస్తూనే వున్నాను. పాపం ఆవిడ పచ్చటి మొహం అవమాన భారంతో ఎర్రగా అయ్యి కన్నీళ్ళ పర్యంతం అయింది. ఇంతలో ఇందాకటి బ్రాహ్మణుడు అంత దూరమునుంచే “సీతమ్మ రావమ్మా! వాళ్ళు వచ్చేసారు” అనిపిలుస్తున్నాడు. “ఆ వచ్చే! వచ్చే!” అనుకుంటూ ఆవిడ అక్కడనుంచి ఆ పక్కగా వున్న గట్టు దగ్గర గా వెళ్ళింది. మళ్లి ఇందాక నేను చూసిన తంతు మొదలుపెట్టారు. అప్పటికే చాల పొద్దు పోవటం తో నేను ఇంటి కి బయల్దేరాను. కానీ ఆరోజంతా అదే సంఘటన నా కళ్ళ ముందు కదలాడ సాగింది.
కాలేజీ లో పరీక్షల మూలం గ, అదీ గాక ఎప్పటి నుంచో వెళ్ళాలనుకొన్న కాశి యాత్రకు కు కూడా వెళ్లి రావడంతో నా ఉదయ వ్యాహళ్లి కార్యక్రమం కొన్ని రోజులు గ వెనుకబడింది. ఇదిగో మళ్ళి ఈవాళ ఆదివారం కావటంచేత కొంచెం తీరుబడిగా గోదారి ఒడ్డు కొచ్చి ఆ ప్రత్యూష వేళలో ఆ నీటి తరగలమీద నుంచి వీచే చల్లని గాలి మనసుని, శరీరాన్ని కూడా సేద తీరుస్తూ వుంటే, ఎంతో హాయిగా, ప్రశాంతం గా వుంది. అలా ఏదో లోకాలలో విహరిస్తున్న నన్ను, “ఏం బాబు బావున్నారా?” అన్న చలపతి గారి పిలుపుతో తెప్పరిల్లి, ఆ! ఆ ‘! చెప్పండి చలపతి గారు ఎలా వున్నారు? ఏమిటి లాంటి కుశల ప్రశ్నలు వేస్తూ ,పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడుస్తున్నాము.
ఇంతలో మళ్ళి ఆవిడ కనిపించింది.కాని మాములుగా కాదు. ఏదో జబ్బు పడి లేచినట్లుగా వుంది. అది చూసిన చలపతి గారు “ ఆ వచ్చేది సీతమ్మకదూ! అయ్యో అలా జబ్బు పడిన దానిలా వుందేమిటి? పాపం సంసారం కోసం మహా కష్ట పడుతుంది,ఏమిటో ఆ దేముడు కొంతమంది నుదుట కష్టాలే రాస్తాడు” అంటూ కొంచెం ఆందోళనగా.ఎమ్మా! సీతమ్మా ఎలా వున్నారు? ఎవరో అమెరికానుంచి వచ్చిన వాళ్ళకి వంటా అది చెయ్యడానికి వాళ్ళతో పాటు వో 15 రోజులు కాశి వెళ్లావు అని చెప్పారు, ఆ విశ్వేశ్వరుని దర్శనం అదీ బాగా అయిందా? అలా అయిపోయవేమిటమ్మ? ఏమి ఒంట్లో బావుండలేదా?” అంటూ ప్రశ్ర్నించారు.
“ఆ, ఆ ,అయింది చలపతి గారు! అబ్బే పెద్ద జబ్బు ఏమి చెయ్యలేదు, కాని అక్కడ స్నానాలు అవి పడలేదండి” అంది ! “అవునమ్మా ! అక్కడి వాతావరణం వేరు”, అంటూ నావైపు తిరిగి “మీరుఎన్నయినా చెప్పండి రామారావు గారు మన రాజమండ్రి, వాతావరణమే నాకు నప్పుతుంది” అని అన్నాడు..
అంతవరకు ఏదో యథాలాపంగా చూస్తున్న నేను ఒక్కసారి సీతమ్మగారిని చూసి షాక్ తిన్నాను. కారణం ఆవిడ ముత్తైదువ గ కనిపించడమే . కొంచెసేపు అయిన తరువాత చలపతి గారు వెళ్ళిపోయారు.
అప్పుడు నేను వెంటనే అసహ్యంగా చూసి, ఆగ్రహం నిండిన గొంతుతో “ ఏమండీ సీతమ్మగారు! మీరు ఇలా ఎందరి ని మోసం చేస్తారు, అది తప్పు, పాపం అనిపించటం లేదా మీకు? ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ పరిస్థితి యెంత దారుణంగ వుంటుందో గ్రహించారా? భర్త చనిపోయినా మీరు ఇలా పుణ్యస్త్రీ గా కనిపిస్తూ అవతలవాళ్ళ ని నమ్మిస్తూ ఇలా చేయడం పాపం కాదా? మీరు కుటుంబం కోసం కష్టపడుతున్నారని తెలిసి అయ్యోపాపం ఒంటరి గా సంసారభారం మోస్తున్నారని అనుకొన్నాను కాని. ఇలా అందర్నీ వంచన చేస్తున్నారని తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని నేను కాశి లో చూసాను, పాపం అది మీకు తెలియదేమో” వ్యంగంగా . అన్నాను
నామాటలకి ఆవిడ మొహం నెత్తురుచుక్కలేకుండా పాలిపోయింది. అసలే నీరసంగా ఉన్నదేమో ఒక్కసారిగా తూలి పడబోయి నెమ్మదిగా తమాయించుకుని “అవును బాబు మీరు చూసినది నిజమే ,కాని నేను ఇలా చెయ్యడానికి గల కారణం చెబుతాను. దయచేసి నన్ను అసహ్యహించు కోవద్దు, నేను చెప్పేది వినండి, అంటూ చెప్పడం మొదలు పెట్టింది. “ మాది చాలా పేద కుటుంబం. మేము గంపెడు సంతానం మా అమ్మ నాన్నలకి. ఏదో భుక్తి కోసం నాన్న చావు మంత్రాలూ చెప్పుతూ,అమ్మ వాళ్ళఇళ్ళల్లో వీళ్ళ ఇళ్ళల్లో వంటలు వండుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అందరిలోకంటే నేను పెద్దదాన్ని,చదువా ఏదో అక్షరంముక్క నేర్చుకొన్నాను. పెళ్లివయసు వచ్చింది. కాని పెళ్లి ఎలా చేస్తారు ? ఏం పెట్టి చేయగలరు?వచ్చే సంపాదన తోఅందరకినాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళడ మే గగనమవుతోంది,ఆ సమయం లో మా మేనత్త, అదే మా నాన్నగారి చెల్లెలు వచ్చింది, వాళ్ళ అబ్బాయికి నన్ను అడగటానికి . వాళ్ళకి ఒకడే కొడుకు,అమాయకుడు, వయసు వచ్చినా మానసిక పరిపక్వత లేదు. ఇకఇందులో నాఇష్టాల ప్రసక్తి అనేదే లేదు. ఇక్కడ నుంచి నేను వెళితే ఒక మనిషి బరువు తగ్గుతుంది. అది ఆలోచించి సరే అన్నాను. మావయ్య ఏదో చావు మంత్రాలూ చెప్పుకొంటూ రెండుపూటలా తిండికి లోటులేకుండా బతుకును ఈడుస్తున్నాడు. పెళ్లి జరిగింది అత్తయ్యతో పాటు నేను వంటలు చేస్తూ, ఇలా పుణ్యస్త్రీగా వాయినాలు అందుకొంటూ కాలం గడుపుతున్నాను. మా బావ చిన్న పిల్లాడితో సమానం. ఎప్పుడో ఒక స్వామీజీ “కాశి “గురించి చెప్పాడుట. అప్పటి నుంచి నేను కాశికి పోతానని ఒకటే గొడవ, నన్ను కూడా అడిగాడు తీసుకొని వెళ్ళమని అలాగే వెళదాము అన్నాను. కాని ఇంతలోనే ఒక రోజున ఇంట్లోంచి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడి కి వెళ్ళాడో తెలియదు. అన్ని చోట్ల వెతికించాను. పోలీసు రిపోర్ట్ కూడా ఇచ్చాను. కాని ఏమి లాభం లేకపోయింది. ఈ సంఘటనతో మావయ్య మంచాన పడ్డారు. అత్తయ్యకి షుగర్ కంప్లైంట్ వుంది దానితో కంటి చూపు బాగా దెబ్బతింది. అత్తయ్య ,మావయ్య కూడా రోజుకోసారి నీకు అన్యాయం చేసామని ఏడుస్తారు. ఈ కష్ట సమయం లో నేనే వాళ్ళని వదిలి వెళ్ళలేకపోయాను. అప్పుడు అనుకొన్నాను. దేముడు నా నుదుటన ఇలాగ రాసాడు. అని సమాధానపరచుకొని వాళ్ళని చూసుకొంటూ,ఇది గో ఈ చలపతి గారి ద్వార నాలుగు రాళ్ళూ తెచ్చుకొంటూ బతుకుని వెళ్లదీస్తున్నాను. ఒక పక్క మా బావ కోసం వెతుకుతూనే వున్నాను. నా కెందు కో అతను కాశి కి వెళ్లి వుంటాడు అని అనిపించేది. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ కూడా వెతికించమని చెప్పాను. ఇదంతా జరిగి పది ఏళ్ళు అయింది. అత్తా, మామలు పండుటాకులయ్యారు. ఏ క్షణమైన రాలిపోవచ్చు, ఇలాంటి సమయంలో నాకు కాశి నుంచి ఒక కబురు వచ్చింది.బావ దొరికాడని,కాని అతను ఆరోగ్యం బాగా దెబ్బతిని చివరి దశలో ఉన్నాడని. అప్పుడు నేను ఇక్కడ వీళ్ళకి ఎవరో అమెరికానుంచి వచ్చిన పెద్దవాళ్ళకి వంటా అది చెయ్యడానికి అక్కడికి రమ్మన్నారు అని చెప్పి వెళ్ళాను. నేను వెళ్ళిన కొంచెం సేపటికే బావ చనిపోయాడని చెప్పారు. అక్కడ వాళ్ళనే బతిమాలుకొని అన్ని అక్కడే కానిచ్చుకొని వచ్చాను. అదే మీరు చూసి వుంటారు.
నాకు తెలుసు నేను చేస్తున్నది సమాజం దృష్టి లో చాలా పెద్దతప్పు అంటారని, కాని నాకున్న కారణాలు, చాలా వున్నాయి అందులో మొదటిది “ఆకలి”. మేము అవటానికి అగ్రవర్ణం వాళ్ళ మైన సమాజంలో మా స్టాయి వేరు. మనిషి పోయినప్పుడు,లేదా ఆబ్దికాలు పెట్టానికి మాత్రమె మావాళ్ళు పనికివస్తారు, శుభకార్యాలకు వెళ్ళలేరు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, మేము వేరే వాళ్ళ చావును కోరుతున్నట్లు అనిపిస్తుంది.. ఇలాంటి స్థితిలో మాకు వేరే జీవనాధారం లేనప్పడు ఆ వచ్చే నాలుగు డబ్బులు కోసం నేను విధవనై మూల కూచుంటే, ఈ ముసలి ప్రాణాలను ఎలా పోషించనూ? శరీరం లో ఊపిరి ఉన్నంతవరకు బతకాలి కదా? ఎలాగూ నాభర్త ఎక్కడి కో వెళ్లిపోయాడని అందరికి తెలుసు. ఈ విషయం చెప్పి ఆ ముసలి ప్రాణాలు రెంటిని క్షోభ పెట్టదలచుకోలేదు. అందుకే నేను సమాజం కోసం కన్నా ఈ పెద్దవాళ్లని, ఆదుకోవడం ముఖ్యం అనుకున్నాను. ఆఫీస్ ఉద్యోగాలు చేసేందుకు నాకా చదువులేదు . నాకొచ్చినది ఒక్కటే, పది మందికి వంటలు చేసిపెట్టడం, ఇదిగో ఇలా పుణ్య వాయనాలు అందుకోవడము. బతకాడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అందుకే ఈ నిర్ణయం. తీసుకొన్నాను” అంటూ చెప్పటం ముగించింది ఆమె.
ఆమె చెప్పినది విన్నాక ఒక సంప్రదాయవాదిగా ఆమె నిర్ణయం హర్షించలేకపోయాను. అలాగ అని పరిష్కారమూ చూపలేకపోయాను.
పాపమో,పుణ్యమో సాంప్రదాయలని పాటించడమే జీవితం అనుకొన్న సీతమ్మ, జీవనభుక్తి కోసం ఆ సాంప్రదాయానికి ఎదురీదెందుకు నిర్ణయించుకొంది.ఆమె తీసుకొన్న నిర్ణయం ధర్మమో, అధర్మమో కాలమే చెప్పాలి? అనుకొంటూ భారమైన మనస్సు తో ఇంటి ముఖం పట్టాను.
***
ఈ అట్టడుగు కంటినీరు కనిపించదు, తుడిచే చేతులు లేవని అనిపించదు
బలంగా వేళ్ళూనుకున్న ఏ సంప్రదాయమైనా బీటలు వారిందంటే అక్కడ కళ్ళకు కనిపించని లోతుల్లో బద్దలైన అవసరమేదో తప్పకుండా ఉంటుందండీ..మీ అనుభవసారంతో అలాంటి ఓ సందర్భాన్ని వీలైనంత సహజంగా, ఆర్ద్రంగా చిత్రించారు.
Thank you.
థాంక్ యు మానసా ! నా కధ నీకు నచ్చినందుకు .
మని Kada Chala బాగుంది కంగ్రాట్స్
కట్టుబాట్లు, సంప్రదాయాలు కన్నా మానవత్వం గొప్పది, అని చెప్పిన తీరు, కదా, కధనం చాలా అద్భుతంగా వున్నాయి. మీరు ఇంకా ఎన్నో మంచి కథలు రాయాలి, అవి చదివి మేము ఆనందించాలి. మీకు హార్దిక అభినందనలు.
ధన్య వాదాలు విజయకుమార్ గారు!
!