ప్రముఖ కథారచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావుకు ప్రతిష్ఠాత్మకమైన చాసో (చాగంటి సోమయాజులు) స్ఫూర్తి పురస్కారం లభించింది. చాసో స్ఫూర్తి సాహిత్య ట్రస్ట్ ప్రతినిధి చాగంటి తులసి ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేశారు. చాసో మార్గాన కళింగాంధ్ర మాండలికంలో ప్రజాజీవితపు కథలు రచిస్తున్నందుకు గాను శ్రీనివాసరావును ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు ఆమె పేర్కొన్నారు. పురస్కారాన్ని 2015 జనవరి 17న విజయనగరంలో జరిగే చాసో శతజయంతి వేడుకల సభల్లో అందజేస్తామని ఆమె తెలియజేశారు.
ఉత్తరాంధ్ర యాసభాషల్లో కథలు రాస్తున్న రచయితగా చింతకింది శ్రీనివాసరావు తెలుగుపాఠకలోకానికి సుపరిచితులు. దాలప్పతీర్థం, పాలమ్మ, పిండిమిల్లు కథల ద్వారా నిరుపేదల, బలహీనుల వ్యదార్థ జీవితాలను ఆయన చిత్రించారు. స్థానీయ పరిస్థితులపై, మానవజీవితంపై ప్రపంచీకరణ చూపుతున్న ప్రభావాన్ని వాడుకపదాల్లో కథగా కట్టడం ఆయనకు తెలిసిన కళ. రావిశాస్త్రి, చాసో, పతంజలి వారసునిగా ఉత్తరాంధ్రలో కథల పంట పండిస్తున్న చింతకింది శ్రీనివాసరావుకు ఇప్పటికే భరతముని సాహిత్య పురస్కారం సహా పలు అవార్డులు దక్కాయి. తాజాగా చాసో స్ఫూర్తి లభించడంతో ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్టుగా చెప్పవచ్చు
అభినందనలు శ్రీనివాసరావు గారు..
డా.చింతకింది శ్రీనివాస రావును 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా పాలకుర్తిలోని సోమనాథ కళాపీఠం ‘సాహిత్య పురస్కారం’తో సన్మానించింది. పురస్కారాలకు వన్నె తెచ్చే రచయిత శ్రీనివాస రావుకు అభినందనలు!
భాష, నుడికారం, శైలి, వీటిని మించిన జీవితం, అందులోని తడి శ్రీనివాస రావు సాహిత్యాన్ని మన గుండెకు సన్నిహితం చేస్తయి.